ఒక్క పాట కోసం తమన్ దేవీల దోస్తీ

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు తమన్, దేవిశ్రీ ప్రసాద్. స్థిరంగా హిట్లు కొట్టే క్రమంలో తమన్ దే పైచేయి అయినప్పటికీ ఇటీవలే వాల్తేరు వీరయ్య రూపంలో దేవి తనలోనూ ఇంకా ఎనర్జీ బోలెడుందని చాటి చెప్పాడు. పుష్ప 2 ది రూల్ తో మళ్ళీ రూల్ చేయగలననే నమ్మకం చూపిస్తున్నాడు. ఈ ఇద్దరి కలయిక బయట చాలా అరుదు. ఆ మధ్య ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంకి జూనియర్ ఎన్టీఆర్ కోసం కలిసి వెళ్లడం తప్పించి బయట స్టేజిలు ఈవెంట్ల దగ్గర స్క్రీన్ షేర్ చేసుకున్న దాఖలాలు చాలా తక్కువ.

తాజాగా ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నట్టు సమాచారం. అయితే సినిమాకు కాదులెండి. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023లో ఆడబోయే సన్ రైజర్స్ టీమ్ కోసం ఒక స్పెషల్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ని కంపోజ్ చేయబోతున్నారట. ఒకరు ట్యూన్ చేసి మరొకరు పాడతారా లేక ఇద్దరు కలిసి పనిచేసి వేరే సింగర్స్ తో మెప్పిస్తారానేది వేచి చూడాలి. స్వతహాగానే తమన్ మంచి క్రికెట్ ప్రియుడు. ఇటీవలే సెలబ్రిటీ లీగ్ లో ఏ రేంజ్ లో ఆడాడో చూశాం. పైగా ఇంటర్నేషనల్ టోర్నీలు జరిగినప్పుడు ఇండియా తరఫున ట్వీట్లు పెడుతూనే ఉంటాడు. చెన్నై సూపర్ కింగ్స్ ధోని అంటే పిచ్చి

ఇక దేవి సైతం స్పోర్ట్స్ లవరే కానీ మరీ ఈ స్థాయిలో కాదు. కారణం ఏదైనా ఈ కాంబో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేదే. ఇంకా అఫీషియల్ న్యూస్ రాలేదు కానీ దాదాపు ఖరారైనట్టేనని టాక్. మార్చి 31న ఐపీఎల్ ప్రారంభమవ్వొచ్చని క్రికెట్ వర్గాల న్యూస్. మే దాకా కొనసాగుతుంది. ఈసారి హైదరాబాద్ టీమ్ సమూల మార్పులకు దారి తీసింది. కీలక ఆటగాళ్లను వదులుకోవడం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. దేవి తమన్ లు కనక ఒక పవర్ ఫుల్ సిగ్నేచర్ సాంగ్ ఇచ్చారంటే అది సన్ రైజర్స్ కి శాశ్వతంగా మిగిలిపోతుంది. చూద్దాం ఎలాంటి పాట ఇస్తారో