జైల్లో రాజభోగం.. ఆ ఖైదీ వేసుకునే చెప్పులు రూ.లక్షన్నర

తీవ్రమైన ఆర్థిక నేరాలు చేసి.. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కిస్తున్న అతగాడి పేరు సుఖేశ్ చంద్రశేఖర్. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదూ? కరెక్టే. ఆర్థిక నేరాలకు పాల్పడి.. రూ.వందల కోట్ల మోసాలు చేసిన కేసులో జైలు జీవితాన్ని గడుపుతున్నాడు సుఖేశ్. ఇతడికి మరో హిస్టరీ కూడా ఉంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాయ్ ఫ్రెండ్ గా.. ఖరీదైన బహుమతులు ఇచ్చి ఆమెను ట్రాప్ చేసినట్లుగా అతడి మీద ఆరోపణలు ఉన్నాయి.

మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఊచలు లెక్కిస్తున్న ఇతడి కారణంగా జాక్వెలిన్ మాత్రమే కాదు.. బాలీవుడ్ కు చెందిన మరో నటి నోరా ఫతేహ్ లు కూడా పోలీసుల విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఇవన్నీ చాలామందికి తెలిసిన విషయాలే. ప్రస్తుతం జైలు జీవితాన్ని అనుభవిస్తున్న సుఖేశ్.. నిజంగానే అనుభవించురాజా టైప్ లో అతగాడి పరిస్థితి ఉందన్న విషయాన్ని గుర్తించారు.

అతడి జైలు జీవితంపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తూ.. అతడి విలాస జీవితం ఒక రేంజ్ లో ఉందన్న విషయం బయటకు పొక్కింది. దీంతో.. జైలర్ దీపక్ శర్మతో పాటు ఇతర అధికారులు సుఖేశ్ శిక్ష అనువిస్తున్న జైలు గదికి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. అక్కడ అతగాడు ఖరీదైన గూచి చెప్పుల్ని వినియోగిస్తున్నట్లుగా గుర్తించి అవాక్కు అయ్యారు. ఎందుకంటే.. ఈ చెప్పుల విలువ కేవలం రూ.1.5 లక్షలు మాత్రమే. అంతేకాదు.. అతగాడు ధరించే రెండు జతల జీన్స్ విలువ రూ.80 వేలుగా గుర్తించారు.

అనూహ్యంగా జైలర్ వచ్చి తన గదిని తనిఖీ చేస్తున్న వేళ.. జైలు గదిలో ఒక పక్కకు వెళ్లి భోరున విలపించిన వైనం.. దానికి సంబంధించిన వీడియోక్లిప్ బయటకు వచ్చింది. తీవ్రమైన ఆర్థిక నేరం ఆరోపణలతో జైలుకు వచ్చి.. ఇంతలా రాజభోగాల్ని అనుభవిస్తున్న అతగాడి తీరుకు జైలు అధికారులు సైతం అవాక్కుఅయ్యారు. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. సుఖేశ్ ను తొలుత తీహార్ జైలుకు తరలించారు.

అయితే.. తన ప్రాణాలకు హాని ఉందంటూ అతడు సుప్రీంకోర్టుకు విన్నవించుకోవటంతో అతన్ని మండోలి జైల్ కు తరలించారు. తీహార్ జైలు అధికారులు తన నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపిస్తూ.. అక్కడి నుంచి మరో జైలుకు షిఫ్టు అయిన అతడు.. జైల్లో రాజభోగాల్ని అనుభవిస్తున్న వైనం అవాక్కు అయ్యేలా చేస్తోంది. తాను కోరుకున్నది అందుబాటులోకి వచ్చేలా చేసుకుంటున్న సుఖేశ్.. అధికారుల తనిఖీలు జరిపిన సమయంలో మాత్రం చిన్న పిల్లాడి మాదిరి రోదించటం గమనార్హం. తనిఖీల వ్యవహారాన్ని రికార్డు చేయగా.. దానికి సంబంధించిన ఫోటోలు బయటకు లీక్ కావటంపై అధికారులు ఆగ్రహంతో ఉన్నారు. అంతర్గత విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది.