భారత క్రికెట్లో పెను దుమారం


టీ20 ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం తర్వాత.. మళ్లీ పుంజుకున్న భారత క్రికెట్ జట్టు ఇటీవల వరుస విజయాలతో సాగిపోతోంది. కొత్త ఏడాదిలో శ్రీలంక, న్యూజిలాండ్‌లపై వన్డేలు, టీ20ల్లో సిరీస్‌లు సాధించి.. ఇటీవలే మొదలైన ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలి టెస్టులో ఘనవిజయాన్నందుకుని మంచి ఊపులో కనిపిస్తోంది. ఇలా అంతా సాఫీగా సాగిపోతున్న వేళ.. ఒక వ్యవహారం భారత క్రికెట్‌ను బలంగా తాకింది.

ఇండియన్ క్రికెట్ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ ఒక టీవీ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్లో భారత జట్టు, క్రికెటర్ల గురించి చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ప్రైవేటు సంభాషణలో భాగంగా చేతన్ చాలా విషయాలపై సంచలన రీతిలో మాట్లాడాడు. ఇదంతా వీడియో తీస్తున్న విషయం తెలియక నోటికొచ్చింది వాగేయడంతో మీడియాలో ఈ విషయం రచ్చ రచ్చగా మారింది.

భారత క్రికెటర్లు ఫిట్‌గా లేకపోయినా ఇంజక్షన్లు తీసుకుని 100 శాతం ఫిట్‌గా మారిపోతారని.. డోప్ టెస్టుల్లో దొరకని ఉత్ప్రేరకం ఉన్న ఇంజక్షన్లను వాళ్లు వాడతారని చేతన్ చెప్పడం గమనార్హం. పెర్ఫామన్స్ సరిగా లేని ఆటగాళ్లు కూడా ఈ ఇంజక్షన్లు తీుకుంటారని చేతన్ చెప్పాడు. ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి చేతన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కోహ్లి కెప్టెన్‌గా ఉండగా.. తాను బీసీసీఐ కంటే గొప్ప అనుకునేవాడని.. రవిశాస్త్రి కోచ్ కావడంలో అతడిదే కీలక పాత్ర అని.. గంగూలీతో కోహ్లీకి ఇగో క్లాష్ తీవ్ర స్థాయిలో ఉండేదని చేతన్ తెలిపాడు.

టీ20 కెప్టెన్సీకి కోహ్లి దూరమయ్యాక అతణ్ని వన్డే సారథ్యం నుంచి కూడా తప్పించాలని బోర్డు పెద్దలతో పాటు సెలక్టర్లు కలిసి ఉమ్మడిగా నిర్ణయించామని.. కానీ అందుకు గంగూలీ మాత్రమే కారణమని కోహ్లి భావించాడని.. ముందుగా తాము సమాచారం ఇచ్చినా ఆ విషయాన్ని దాచిపెట్టి తనను కెప్టెన్‌గా తప్పిస్తున్న విషయం తనకు చెప్పలేదంటూ మీడియా ముందు అబద్ధం చెప్పాడని కోహ్లి మీద విమర్శలు గుప్పించాడు చేతన్.

భారత జట్టులో కోహ్లి, రోహిత్ వేర్వేరుగా రెండు గ్రూప్‌లను మెయింటైన్ చేస్తున్నారని.. వారి మధ్య కూడా అప్పుడప్పడూ ఇగో క్లాష్ తలెత్తుతూ ఉంటుందని చేతన్ అన్నాడు. ఇలా పలు విషయాలపై చేతన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై బీసీసీఐ ఇంకా అధికారికంగా ఏమీ స్పందించలేదు. కానీ చేతన్ మీద వేటు వేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.