ఫార్ములా-ఈ సంబరం.. హైదరాబాదీలకు నరకం

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో మోటార్ స్పోర్ట్స్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఫార్ములావన్ ఇండియాలో మాత్రం హిట్ కాలేకపోయింది. పదేళ్ల కిందట ఇండియన్ గ్రాండ్ ప్రిని మొదలుపెట్టి మూడేళ్లు నడిపించి.. ఇక్కడ పెద్దగా ఆదరణ లేకపోవడంతో దాన్ని మూసేశారు. మళ్లీ ఇంత కాలానికి ఫార్ములావన్ తరహాలోనే సాగే ఫార్ములా-ఈ రేసింగ్ ఛాంపియన్‌షిప్ ఇండియాకు వచ్చింది. ఫార్ములావన్‌కు, దీనికి తేడా ఏంటంటే.. ఇది ఎలక్ట్రిక్ కార్లతో, పర్యావరణానికి హాని కలిగించకుండా సాగే రేసు. ఇండియాలో తొలిసారి జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇస్తున్నది హైదరాబాద్ కావడం విశేషం. దీని గురించి హైదరాబాదీలు, తెలంగాణ ప్రభుత్వం గర్వంగా చెప్పుకోవడం బాగానే ఉంది కానీ.. ఈ రేసు నగర వాసులకు నరకం చూపించేస్తోంది.

ఇలాంటి రేసులు నగర శివార్లలో విశాలమైన ప్రదేశాలు చూసి ట్రాక్ ఏర్పాటు చేసుకుని నిర్వహించాల్సింది. కానీ వరల్డ్ వైడ్ పెద్ద సిటీల్లో ఆయా నగరాల నడిబొడ్డునే నిర్వహించారని.. ఇక్కడ కూడా అలాగే చేయాలని హుస్సేన్ సాగర్ పక్కన ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్ సిటీలో ప్రధాన రహదారులను కలిపే మార్గం. ఈ రేసు కారణంగా పలు మార్గాల్లో ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. చాలా ఆంక్షలు పెట్టారు. దీంతో మామూలు రోజుల్లోనే విపరీతంగా ఉండే ట్రాఫిక్.. ఈ ఆంక్షలు, డైవర్షన్లతో మరింత దారుణంగా తయారైంది.

రేసుకు సన్నాహాలతో మొదలుపెట్టి ఐదారు రోజుల నుంచి ఈ డైవర్షన్ నడుస్తోంది. రేసు ముగిశాక కూడా కొన్ని రోజులు ఆంక్షలు కొనసాగబోతున్నాయి. దీంతో ఒక వారం పాటు హైదరాబాదీలకు నరకం తప్పట్లేదు. చుట్టు పక్కల కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయి నరకం చూస్తున్నారు జనాలు. శుక్రవారం అయితే ఈ నరకాన్ని భరించలేక కొన్ని చోట్ల బారికేడ్లు తొలగించుకుని ముందుకు దూసుకెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వ తీరు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లాంటి అత్యంత రద్దీ ఉండే సిటీల్లో ఇంకోసారి ఇలా నగరం మధ్యలో రేసు నిర్వహించొద్దని.. నగర శివార్లలో ఏర్పాట్లు చేసుకోవాలని బలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.