ఆశారాం బాపూకు 81 ఏళ్ల వ‌య‌సులో జీవిత ఖైదు!

ఆయ‌న‌కు 81 సంవ‌త్స‌రాల వ‌య‌సు. కానీ, ఓ కోర్టు ఆయ‌న‌కు జీవిత ఖైదు విధించింది. అది కూడా స‌ద‌రు వ్య‌క్తి 70 ఏళ్ల వ‌య‌సు లో చేసిన త‌ప్పున‌కు ఈ శిక్ష విధించ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌నే గుజ‌రాత్‌కు చెందిన‌ ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు దేశ‌, విదేశాల‌లోనూ మంచి పేరు తెచ్చుకున్న ఆశారాం బాపూ. అంద‌రూ గురూజీ, స్వామీజీగా పిలుచుకునే బాపూ.. ప‌దేళ్ల కిందట త‌న ఆశ్ర‌మంలో ప‌నిచేస్తున్న ఓ మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. కోర్టుకు చార్జిషీటు స‌మ‌ర్పించారు.

ఈ క్ర‌మంలో అరెస్ట‌యిన బాపూ.. అప్ప‌టి నుంచి విచార‌ణ ఖైదీగా ఉన్నారు. గాంధీనగర్‌లోని సెషన్స్‌ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. బాపూ చేసిన నేరానికి జీవిత ఖైదు విధించింది. ఆయన ఆశ్రమంలో శిష్యురాలిగా ఉన్న తనను అక్రమంగా నిర్బంధించి 2001 నుంచి 2006 మధ్య పలుమార్లు అత్యాచారం చేసినట్టు సూరత్‌కు చెందిన మహిళ ఆరోపించింది. దీనిపై అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది. అత్యంత వివాదంగా కూడా మారింది. మొద‌ట్లో కేసు కూడా న‌మోదు చేసేందుకు పోలీసులు ముందుకురాలేదు.

ఎట్ట‌కేల‌కు కోర్టు జోక్యంతో 2013లో బాపూతో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన కోర్టు తగిన ఆధారాలు లేకపోవడంతో ఆశారాం బాపూ భార్య సహా మిగిలిన వారిని నిర్దోషులుగా ప్రకటించింది. కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపూ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జైలులో ఉన్నారు. ఆశారాం బాపూ గతంలో అధ్యాత్మిక గురువుగా ఎందరో శిష్యులను సంపాదించుకున్నారు. దేశ విదేశాల్లో 400 కేంద్రాలను స్థాపించారు.

40కి పైగా కార్పొరేట్ స్కూళ్ల‌ను నిర్వ‌హిస్తున్నారు. అనేక మంది రాజ‌కీయ నేత‌ల‌కు గురువుగా ఆయ‌న పేరు ఒక ద‌శ‌లో మార్మోగింది. తాజా తీర్పులో సెక్ష‌న్ 376, 377 ప్ర‌కారం ఆయ‌న‌కు జీవిత ఖైదు విధిస్తున్న‌ట్టు కోర్టు ప్ర‌క‌టించింది. అదేవిధంగా రూ.50 వేల జ‌రిమానా కూడా విధించింది. అయితే.. 81 ఏళ్ల వ‌య‌సులో జీవిత ఖైదు విధించ‌డం.. దేశంలో స్వామీజీల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు వంటివి చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.