సన్ రైజర్స్ మేడమ్ కే లైన్ వేశాడు.. ఓపెన్ గా మ్యారేజ్ ప్రపోజల్!

కావ్యా మారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు సహ యజమానిగా వ్యవహరిస్తున్న ఆమె సీఈవోగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 30 ఏళ్ల ఈ యువ వ్యాపార వేత్త మరెవరో కాదు.. మాజీ కేంద్ర మంత్రి కళానిధి మారన్ గారాల పట్టి. ఐపీఎల్ వేలం వేళ మేడమ్ చేసే సందడి.. ఆమె వ్యవమరించే తీరు తరచూ మీడియాలో వార్తలుగా మారుతూ ఉంటాయి.

సన్ రైజర్స్ జట్టుకు ఇప్పుడు ఫేస్ ఆఫ్ ద టీంగా మారటమే కాదు.. ఆమె ఎక్కడ ఉందంటే అక్కడ ఆమె ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లలోనూ ఆమె మీద ఆసక్తి అధికం. మన దేశంలో ఎలా అయితే ఐపీఎల్ టోర్నీ ఉంటుందో సౌతాఫ్రికాలోనూ టీ20 లీగ్ నడుస్తోంది. దీనికి సంబంధించి సౌతాఫ్రికాలో ఆమె సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ పేరిట కూడా కొనుగోలు చేశారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు సదరు జట్టు మూడు మ్యాచుల్ని ఆడింది.

తాజాగా రాజస్థాన్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్ తో తలపడిన ఈ మ్యాచ్ ను కావ్యా మారన్ స్వయంగా తిలకించారు. స్టాండ్స్ లో కూర్చున్న ఆమె మ్యాచ్ చూస్తూ.. జట్టును ఉత్సాహపర్చారు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ కు వచ్చిన ఒక ప్రేక్షకుడు కావ్యా మారన్ కు లైన్ వేశారు. “కావ్యా మారన్.. నన్ను పెళ్లి చేసుకుంటావా?” అన్న ప్రశ్నతో పాటు లవ్ సింబల్ వేసి తన ప్రేమను వ్యక్తం చేశారు.

అయితే.. దీనికి సంబంధించిన చిట్టి వీడియోను సౌతాఫ్రికా టీ20 లీగ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేయటంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో కావ్యా మారన్ మీద మీమ్స్ తో సందడి చేస్తున్నారు. మేడమ్ సార్.. మేడమ్ అంతే అంటూ అల వైకుంఠపురం మూవీలో అల్లు అర్జున్ మాదిరి చెబుతున్నారు. తాజా మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఏమైనా.. దేశం కాని దేశంలో కావ్యా మారన్ ఇమేజ్ ఇంతనా అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.