వందే భారత్ : ఫోటోకోసం వెళ్లి బుక్ అయ్యాడు



‘అట్లుంటది మనతోని’ అన్నట్లుగా మారింది వందే భారత్ ట్రైన్ వ్యవహారం. మోడీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ ట్రైన్ సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల మధ్యన నడిపిస్తున్న సంగతి తెలిసిందే. సెల్ ఫోన్.. సోషల్ మీడియా చుట్టూ నడుస్తున్న వేళ.. కొత్తది ఏది కనిపించినా వెంటనే ఫోటో తీసుకునే అలవాటు ఈ మధ్యన ఎక్కువైందన్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి పనే చేసి అడ్డంగా బుక్ అయ్యాడో వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రైన్ లోపల ఫోటో తీసుకోవాలని ఆశపడ్డాడో వ్యక్తి. అందులో భాగంగా.. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ట్రైన్ రాజమండ్రిలో ఆగింది. ఆ వెంటనే ట్రైన్ లోకి ఎక్కిన వ్యక్తి ఒకరు ట్రైన్ లోపల ఫోటోలు తీసుకునే హడావుడిలో ఉన్నాడు. ఆ స్టాప్ లో కేవలం ఒకట్రెండు నిమిషాలు మాత్రమే ట్రైన్ ఆగుతుంది. వందే భారత్ ట్రైన్ లో ఉన్న కొత్త ఫీచర్ ఏమంటే.. మెట్రో రైలు మాదిరి.. ట్రైన్ కదలటానికి ముందు.. రైలు డోర్లు మొత్తం ఆటోమేటిక్ గా మూసుకుపోతాయి.

మళ్లీ రైలు ఆగినప్పుడు మాత్రమే తెరుచుకుంటాయి. రాజమండ్రిలో ఫోటోల కోసం ట్రైన్ ఎక్కిన వ్యక్తి .. లోపలి ఫోటోలు తీసుకునే సరికి బండి మూవ్ కావటం.. అప్పటికే డోర్లు మూసుకుపోవటం జరిగిపోయాయి. డోర్ తీసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అప్పటికే అక్కడకు చేరుకున్న టీసీ.. డోర్ తెరుచుకోదని.. రాజమండ్రి నుంచి విజయవాడ వరకు వెళ్లాల్సిందే తప్పించి మరో అవకాశం లేదని తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా రైల్వే సిబ్బంది ఒకరు దురుసుగా.. బుద్ది ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తే.. మరో ఇద్దరు మాత్రం అందుకు భిన్నంగా.. ఫోటోలు బయట నుంచి తీసుకోవాలి బాసు.. ఒకసారి ట్రైన్ కదిలితే తర్వాతి స్టేషన్ వరకు చేసేదేమీ లేదని చెప్పారు. ఫోటో కోసమని రాజమండ్రిలో ట్రైన్ ఎక్కిన సదరువ్యక్తి.. ఊహించని పరిణామానికి షాక్ తిన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇలాంటి వేళ.. టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కినందుకు టికెట్ ఖర్చుతో పాటు ఫైన్ చెల్లించాల్సి వచ్చింది.

అంతేకాదు.. విజయవాడ వెళ్లిన తర్వాత మళ్లీ రాజమండ్రికి మరో ట్రైన్ లో వెళ్లాల్సిన పరిస్థితి. మొత్తంగా వందే భారత్ లో ఫోటో కోసం ప్రయత్నించిన సదరు వ్యక్తికి చేతికి డబ్బులు వదలటమే కాదు..దాదాపు ఆరేడు గంటల సమయం వేస్టు అయిన పరిస్థితి. ఫోటో కోసం ట్రైన్ లోపలకు వచ్చిన వ్యక్తికి ఎదురైన ఇబ్బంది.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పెద్ద ఎత్తున షేర్ అవుతోంది. అతగాడి ఫోటో అవస్థ.. పలువురి పెదాల మీద చిరునవ్వులు చిందేలా చేస్తోంది.