సుశాంత్ కుక్క పోయింది.. మళ్లీ గొడవ

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి రెండున్నరేళ్లు దాటిపోయింది. నటనలో, సినిమాల ఎంపికలో ప్రతిభ, అభిరుచి చాటుకుంటూ పెద్ద స్టార్ అయ్యేలా కనిపించిన ఈ యువ నటుడు అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ కలచివేసింది. ముందు అతడిది ఆత్మహత్యగా భావించినా.. తర్వాత అనుమానాస్పద మృతిగా భావించారు.

కానీ ఈ విషయంలో ఏ సాక్ష్యాధారాలు బయటికి రాకపోవడంతో కేసు క్లోజ్ అయిపోయింది. ఇటీవల సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన సిబ్బందిలో ఒకరు.. అతడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనం రేపింది.

రెండేళ్ల పాటు సుశాంత్ మృతిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. సోషల్ మీడియాలో బాలీవుడ్ ప్రముఖులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ వచ్చిన అతడి అభిమానులు.. ఈ ఆరోపణలతో మళ్లీ మేల్కొన్నారు. మళ్లీ బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ వచ్చారు.

ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చిన సుశాంత్ ఫ్యాన్స్.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. అందుక్కారణం సుశాంత్ కుక్క చనిపోవడమే. సుశాంత్‌కు కుక్కల మీద అమితమైన ప్రేమ ఉంది. అతను ఫడ్జ్ అనే జాతి కుక్కును పెంచుకుంటుండేవాడు. దాంతో కలిసి దిగిన అనేక ఫొటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి.

ఐతే సుశాంత్ మరణం తర్వాత అది బెంగ పెట్టేసుకుందట. ఆ బెంగతోనే తాజాగా అది ప్రాణాలు వదిలింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. తన స్నేహితుడిని కలవడానికి ఫడ్జ్ స్వర్గానికి వెళ్లిపోయిందని.. దాన్ని అనుసరిస్తూ తాము కూడా త్వరలోనే వచ్చేస్తామని.. సుశాంత్ సోదరి ఎమోషనల్ పోస్టు పెట్టింది.

ఇది సుశాంత్ అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. సుశాంత్ మరణానంతరం అతడి ఫొటో పెట్టుకుని దిగాలుగా పడుతున్న ఫడ్జ్ ఫొటోను పెట్టి ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా మరోసారి బాలీవుడ్ సెలబ్రెటీలు, నెపో కిడ్స్‌ను టార్గెట్ చేస్తూ హేట్ పోస్టులతో ట్రెండ్ చేస్తున్నారు.