సానియా మీర్జా.. చెప్పేసింది

భారత పురుషుల టెన్నిస్‌ను లియాండర్ పేస్, మహేష్ భూపతి లాంటి దిగ్గజాలు 90వ దశకంలోనే ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ స్టార్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో విజయాలు సాధించారు. వీరి తర్వాత రోహన్ బోపన్న లాంటి కొత్త తరం ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనే చేశారు. కానీ భారత మహిళల టెన్నిస్ విషయానికి వస్తే మాత్రం రెండు దశాబ్దాల నుంచి వినిపిస్తున్న ఏకైక పేరు సానియా మీర్జాదే.

కెరీర్ ఆరంభంలోనే సంచలన విజయాలతో ప్రపంచ స్థాయికి ఎదిగిన సానియా.. ఇటు సింగిల్స్‌లో, అటు డబుల్స్‌లో ఎన్నో సంచలనాలు రేపింది. ముఖ్యంగా డబుల్స్‌లో గ్రాండ్ స్లామ్ విజయాలతో తన స్థాయిని చాటిచెప్పింది. విజయాలతో పాటు వివాదాలు కూడా వెంటాడినా ఆమె ఏ రోజూ చలించింది లేదు. 30 ప్లస్‌లోకి వచ్చాక కూడా కొన్ని మరపురాని విజయాలు సాధించి భారత టెన్నిస్ కీర్తి పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగురవేసింది.

కొన్నేళ్ల నుంచి జోరు తగ్గించిన సానియా.. రిటైర్మెంట్ దిశగా అడుగులేస్తున్నట్లే కనిపించింది. రెండు మూడేళ్ల కిందటే రిటైరయ్యేలా కనిపించినా ఆమె.. ఎలాగోలా కెరీర్‌ను పొడిగించుకుంటూ వచ్చింది. ఐతే ఎట్టకేలకు ఆమె ఆటకు టాటా చెప్పేయబోతోంది. వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరిగే డబ్ల్ల్యూటీఏ 1000 టోర్నీతో సానియా ఆట నుంచి వీడ్కోలు పలకబోతోంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సానియా ధ్రువీకిరంచింది. నిజానికి గత ఏడాది చివర్లో యుఎస్‌ ఓపెన్‌తోనే సానియా రిటైరవ్వాలనుకుంది. కానీ దానికి ముందు గాయపడడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. మైదానంలో ఆడుతూ, అభిమానుల సమక్షంలో ఆటకు వీడ్కోలు పలకాలన్న ఉద్దేశంతో గాయం నుంచి కోలుకున్నాక తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టింది.

ఈ నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆడేసి.. వచ్చే నెలలో దుబాయ్ టోర్నీతో ఆమె ఆట నుంచి తప్పుకోనుంది. సానియా తన భర్త షోయబ్ మాలిక్ నుంచి విడాకులు తీసుకోనున్నట్లు ఈ మధ్య వార్తలు రావడం.. ఐతే అదంతా ఒక టీవీ షో ప్రమోషన్లో భాగంగా చేసిన పబ్లిసిటీ స్టంట్ అని తేలడం విమర్శలకు దారి తీసింది. మరి ఆట నుంచి ఖాళీ అయ్యాక సానియా తన యాక్టివిటీస్‌తో ఇంకెన్ని వివాదాలకు తెర తీస్తుందో చూడాలి.