‘ఒక్క వేటు’కు రెండు లాభాలు.. భ‌ర్త‌ను చంపిన భార్య‌!!

మూడుముళ్ల బంధంతో ఒక్క‌టైన స్త్రీ, పురుషుడు జీవితాంతం తోడు నీడ‌గా ఉంటార‌ని, వారిని క‌న్న త‌ల్లి దండ్రులు ఆశిస్తారు. అయితే.. ఇప్పుడు ఈ తోడు, నీడ‌ల మాటేమోకానీ.. లేనిపోని ఆలోచన‌ల‌తో జీవితాల‌ను దుర్భరం చేసుకునే ప‌రిస్థితికి వ‌స్తున్నాయి. తాజాగా ఓ భార్య ఖ‌త‌ర్నాక్ ప‌నిచేసింది. త‌న భ‌ర్త చ‌నిపోగా వ‌చ్చే ఉద్యోగంపై క‌న్నేసింది. భ‌ర్త‌ను చంపేస్తే.. కారుణ్య కోటా కింద‌.. ఆయ‌న ఉద్యోగం ప‌ట్టేయొచ్చ‌ని ప్లాన్ చేసింది. అంతే.. ఇంకేముంది.. దారుణానికి వ‌డిగ‌ట్టింది.

ఏం జ‌రిగిందంటే..

తెలంగాణ‌లోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని గాంధీ కాల‌నీలో కొమ్మ‌ర బోయిన శ్రీనివాస్‌(50), సీతామ‌హాలక్ష్మి దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరికి వివాహ‌మై.. దాదాపు 25 ఏళ్ల‌పైగానే అవుతుంది. ఇక‌, శ్రీనివాస్‌.. కొత్త‌గూడెం క‌లెక్ట‌రేట్‌లో అటెండ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఈయ‌న‌కు.. మ‌ద్యం తాగే అల‌వాటు ఉంది. రోజూ తాగి రావ‌డం.. భార్య‌ను వేధించ‌డం.. ప‌నిగా పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది.

అంతేకాదు.. ఇంట్లోకి కూడా డ‌బ్బులు స‌రిగా ఇవ్వ‌డం లేదని భార్య ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలో విసిగిపోయిన భార్య‌.. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చందంగా.. వ్యూహం రెడీ చేసుకుంది. ఎన్నాళ్లు ఈ వేధింపులు భ‌రిస్తాను అనుకుందో ఏమో.. వెంట‌నే ఒక ప్లాన్ చేసుకుంది. గ‌త‌ నెల 29న భ‌ర్త తాగి ఇంటికి వ‌చ్చి ప‌డుకున్న స‌మ‌యంలో ఆయ‌న‌పై రోక‌లి బండ‌తో ఒక్క‌బాదు బాది చంపేసింది. అనంత‌రం, బాడీని వంట‌గ‌దిలోకి తీసుకువెళ్లి ప‌డుకోపెట్టింది. త‌ద్వారా.. వేధింపులు త‌ప్ప‌డంతోపాటు.. మ‌రోవైపు కారుణ్య మ‌ర‌ణం కింద ప్ర‌భుత్వ కొలువు కూడా ద‌క్కుతుంద‌ని ఆమె లెక్క‌లు వేసుకుంది.

ఇదీ క‌ల‌రింగ్‌

అయితే..హ‌త్య‌కు గురైన వ్య‌క్తికి కారుణ్య మ‌ర‌ణం వ‌ర్తించ‌దు క‌నుక‌.. త‌ను హ‌త్య చేస్తే.. అస‌లుకే మోసం వ‌స్తుంది కాబ‌ట్టి.. సీతామ‌హాల‌క్ష్మి బిగ్ ప్లాన్ చేసింది. గత నెల 29న అర్ధరాత్రి తన భ‌ర్త‌ వంటింట్లో జారిపడ్డాడని, తలకు తీవ్ర గాయమైందని సీతామహాలక్ష్మి మర్నాడు ఉదయం కొత్తగూడెంలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది. కొద్దిగంటల చికిత్స అనంతరం ఆయన మృతి చెందాడు. ఇక్క‌డితో త‌ను సేఫ్ అయిపోయాన‌ని ఆమె భావించింది.

కానీ, యూట‌ర్న్‌

తండ్రి మృతిపై అనుమానం ఉన్నట్లు కుమారుడు సాయికుమార్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కనిపించకుండా పోయిన సీతామహాలక్ష్మిపై పోలీసులు కూడా నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వేస్టేషన్‌కు రాగా అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అస‌లు విష‌యం వెలుగు చూసి.. ఖ‌త‌ర్నాక్ భార్య‌.. క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లింది.