ఎవరీ షేక్ రషీద్? ధోనీ జట్టులో గుంటూరు కుర్రాడు!

ప్రతిభ ఉంటే సరిపోదు. దాన్ని చూపించుకునే వేదిక చాలా అవసరం. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు గుంటూరుకు చెందిన కుర్రాడు షేక్ రషీద్. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఈ కుర్రాడు ఏకంగా ధోని జట్టులోకి ఎంపికయ్యాడు. అతన్ని తాజాగా జరిగిన వేలంలో రూ.20 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.

ఇప్పటికే తానేమిటన్నది రుజువు చేసుకున్న రషీద్.. ఇప్పుడు ఏకంగా ధోనీ ప్రాతినిధ్యం వహించే జట్టులోకి చోటు దక్కించుకోవటమే కాదు.. అంతటి దిగ్గజ ఆటగాడితో కలిసి డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకునే అవకాశం అతని సొంతమైంది.

గుంటూరుకు చెందిన ఈ మధ్య తరగతి కుర్రాడు తన ప్రతిభతో ఇప్పటికే క్రికెట్ లో తన సత్తా చాటాడు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లో అద్భుతంగా రాణించటంతో పాటు.. ఈ ఏడాది జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టుకు రషీద్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించటం తెలిసిందే. నిజానికి ఐపీఎల్ 2022 వేలంలో అతడికి మంచి అవకాశం వస్తుందని భావించినా.. అప్పట్లో దక్కలేదు.

తాజాగా నిర్వహిస్తున్న మినీ వేలంలో రషీద్ ను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకోవటంతో అతగాడి సుడి తిరిగిందని.. ఆటలో అతడు చూపించే ప్రదర్శన.. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు తలుపుతట్టటం ఖాయమంటున్నారు. ప్రస్తుతం పద్దెనిమిదేళ్లు ఉన్న రషీద్.. గుంటూరుకు చెందిన ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. తొమ్మిదేళ్లకే అండర్ 14 క్రికెట్ లో అరంగ్రేటం చేసిన అతను.. అండర్ 19 ప్రపంచ జట్టుకు ఎంపిక కావటంతో అతని ప్రతిభ ఏమిటన్నది ప్రపంచానికి తెలిసింది.

ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో యాభై పరుగులు చేసిన రషీద్.. భారత జట్టు ప్రపంచ కప్ టైటిల్ ను సొంతం చేసుకోవటంలో కీలక భూమిక పోషించాడు. అలా అందరి కంట్లో పడిన అతను ప్రపంచ కప్ టోర్నీలో మొత్తం 201 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చిన ఇతగాడికి సరైన బ్రేక్ వస్తే ఒక వెలుగు వెలుగుతాడన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వేళలో చెన్నై సూపర్ కింగ్స్ లోకి తాజా వేలంలో తీసుకోవటం ద్వారా అతని ఫ్యూచర్ కు అవసరమైన కీలక టర్న్ వచ్చేసిందన్న మాట వినిపిస్తోంది.