శ్రద్దాను హత్య చేసినోడు తీహార్ జైల్లో అలా ఉంటున్నాడట

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రద్దా వాకర్ దారుణ హత్య ఉదంతంలో నిందితుడిగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా. సహజీవనం చేస్తూ.. పెళ్లి కోసం ఒత్తిడి చేసిందన్న కారణంగా దారుణమైన రీతిలో ముక్కలు ముక్కలుగా నరికి.. ఇంట్లోని పెద్ద ఫ్రిజ్ లో అట్టి పెట్టి.. ఒక్కో ముక్కను విడిగా బయట పారేసి వచ్చిన భయంకర ఉదంతం వెలుగు చూడటం తెలిసిందే. కోర్టు విధించిన రిమాండ్ లో భాగంగా అతడ్ని తీహార్ జైలుకు తరలించారు.

జైల్లో ఉన్న అతను ఎవరితోనూ మాట్లాడటం లేదని.. ముభావంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. తన కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు సైతం ఆసక్తి చూపటం లేదని జైలు అధికారులు వెల్లడించారు. జైల్లోని తన సెల్ లో పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతున్నట్లుగాచెబుతున్నారు. ఇప్పటికి తన కుటుంబ సభ్యులు.. స్నేహితుల జాబితాను ఆఫ్తాబ్ ఇవ్వలేదని చెబుతున్నారు.

తీహార్ జైల్లో ఉన్న ఖైదీలకు తమ కుటుంబ సభ్యులు.. మిత్రుల్ని కలుసుకునేందుకు వారంలో రెండు రోజులు అవకాశం ఇస్తారు. అంతేకాదు.. వారంలో రెండు రోజుల పాటు ఐదు నిమిషాల చొప్పున ఫోన్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. అయితే.. ఇందుకోసం రాతపూర్వకంగా సదరు వ్యక్తుల ఫోన్ నెంబర్లను ఇవ్వాల్సి ఉంటుంది. అఫిడవిట్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆఫ్తాబ్ అలాంటిదేమీ చేయలేదని చెబుతున్నారు.

ఎవరితో కలవకుండా తన మానాన తాను ఉంటున్న అతడికి జైలు అధికారులు ఇంగ్లిషు నవల్స్ ఇచ్చారు. అమెరికన్ రచయిత పాల్ థెరౌక్స్ ట్రావెల్ లాగ్ అయిన ది గ్రేట్ రైల్వే బజార్ పుస్తకాన్ని ఇవ్వగా.. మరికొన్ని పుస్తకాలు కూడా తనకు ఇవ్వాలని కోరినట్లుగా చెబుతున్నారు.