రెండు రూపాయ‌ల‌కే.. బాల‌య్య చికెన్‌ బిర్యానీ!

టీడీపీ నాయ‌కుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. రాజ‌కీయాల్లో సైలెంట్‌గా ఉంటార‌నే పేరున్న‌ప్ప‌టికీ.. అవ‌స‌రం.. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ.. బాల‌య్య త‌న విశ్వ‌రూపం చూపిస్తూనే ఉన్నారు.

టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని పుర‌స్క‌రించుకుని త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అనేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. పేద‌ల‌కు రూ.2 కే భోజ‌నం అందిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు ప్రాంతాల్లో నిత్యం మ‌ధ్యాహ్నం 11 – 2 గంట‌ల వ‌ర‌కు ఈ భోజ‌నం అందుతోంది.

మొబైల్ క్యాంటీన్ల‌పై తీసుకువ‌స్తున్న వేడి వేడి రుచిక‌ర‌మైన భోజ‌నం అందుకునేందుకు అనేక మంది కార్మికులు, పేద‌లు, కూలీలు .. క్యూ క‌ట్టి మరీ వేచి ఉంటున్నారు. ఇలాంటివి నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు.

దీనిని బాల‌య్య స‌తీమ‌ణి వ‌సుంధ‌ర ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇటీవ‌ల అధునాతన వైద్య సేవ‌లు అందించేలా.. మొబైల్ ఆసుప‌త్రిని కూడా నియోజ‌క‌వ‌ర్గానికి బాల‌య్య అందించారు.ఇలా.. త‌న‌దైన సేవ‌ల‌తో ఆయ‌న ముందుంటున్నారు.

ఇక‌, తాజాగా క్యాంటీన్లు ఏర్పాటు చేసి 200 రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా రూ.2కే చికెన్ బిర్యానీని వేడివేడిగా అందించారు. వాస్త‌వానికి ఏదైనా హోట‌ల్‌లో చికెన్ బిర్యానీ తినాలంటే.. క‌నీసంలో క‌నీసం రూ.100 కేటాయించాలి. అలాంటిదిరూ.2కే ఘుమ‌ఘుమ లాడే బిర్యానీని వేడివేడిగా వండించి .. త‌న నియోజ‌క‌వ‌ర్గం పేద‌ల జిహ్వా చాప‌ల్యాన్ని తీర్చారు బాల‌య్య‌.

ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు దాదాపు క్వింటా బాసుమ‌తి బియ్యం, 500 కిలోల చికెన్‌తో సుమారు 50 మంది ఈ బిర్యాన్ని రూపొందించి పేద‌ల‌కు అందించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. మొత్తానికి బాల‌య్య బిర్యానీని రుచి చూసేందుకు ప్ర‌జ‌లు క్యూక‌ట్టి మ‌రీ నిల్చోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది.