షాకింగ్ సర్వే: కాపురాల్లో చిచ్చు రేపుతున్న స్మార్ట్ ఫోన్

ఈరోజుల్లో సెల్ ఫోన్ చేతుల్లో లేకుండా ఎవరూ కనిపించడం లేదు. మన రోజు వారి జీవితంలో చరవాణి భాగం అయిపోయింది. అయితే వీటి వల్లే భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలకు దారితీస్తోందని ఒక సర్వే తెలిపింది. ప్రతి 10 మంది భారతీయ దంపతుల్లో 8 మంది సెల్ ఫోన్ కారణంగానే విడిపోతున్నారు అన్న షాకింగ్ వాస్తవం వెల్లడింది.

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాదాపు 67 శాతం మంది తన భాగస్వామితో సెల్ ఫోన్ వాడుతూనే కాలం గడుపుతున్నట్లు చెబుతున్నారు. ఇక 66% మంది సెల్ ఫోన్ వల్ల తమ భాగస్వామితో సరిగ్గా కాలం గడపలేకపోతున్నామని వారి వివాహ సంబంధం బలహీన పడిందని ఒప్పుకున్నారు. 70 శాతం మంది అయితే ఫోన్ వాడుతున్నప్పుడు అంతరాయం కలిగిస్తే చిరాకు పడతామని కూడా చెప్పారు.

సైబర్ మీడియా రీసర్చ్ (CMR) వివో (Vivo) వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పైన విషయాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో 1.2 బిలియన్ల మంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు 600 మిలియన్లకు పైగా స్మార్ట్ ఫోన్లు వాడుకలో ఉన్నాయి. వీళ్ళలో 68 శాతం మంది తమ భాగస్వామితో సంభాషించేటప్పుడు శ్రద్ధ వహించట్లేదని తెలుపుతూనే అర్థవంతమైన జీవితం కోసం ఈ అలవాటును మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపారు.

మొత్తానికి భారతీయుల వైవాహిక జీవితంలో స్మార్ట్ ఫోన్ సవతి పాత్ర పోషిస్తోందన్న విషయం మాత్రం అర్థమవుతుంది.