ఇది క‌దా నాన్నపై ప్రేమంటే!

నాన్న‌కు ప్రేమ‌తో అంటూ.. త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో అనేక కామెంట్లు ప‌డుతుంటాయి.అ యితే, వీరిలో ఎంత మంది నిజంగా నాన్న‌పై ప్రేమ‌ను కురిపిస్తున్నారో చెప్ప‌డం క‌ష్ట‌మే(?). అయితే.. త‌మిళ‌నాడుకు చెందిన ఓ త‌న‌యుడు మాత్రం నిజంగానే త‌న నాన్న‌పై ప్రేమ‌ను కురిపించారు. తాను త‌ల్లి క‌డుపు నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి ముందే క‌న్ను మూసిన తండ్రి స‌మాధినైనా చూద్దామ‌నే ఆశ‌తో ఆయ‌న దేశాలు ప‌ట్టుకుని తిరిగారు. చివ‌ర‌కు గుర్తించి, నివాళుల‌ర్పించి, క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

ఎవ‌రు.. ఎందుకు?

తాను అమ్మ కడుపులో ఉండగానే నాన్న చనిపోయారు. నాన్నను ఎలాగూ చూడలేదు.. కనీసం ఆయన సమాధినైనా చూడాలనేది ఆ కుమారుడి ఆరాటం. అందుకోసం తపించారు. గూగుల్‌ సాయంతో అన్వేషించి, మలేషియాలో ఉన్న సమాధిని గుర్తించారు. తమిళనాడు నుంచి అక్కడకు వెళ్లి సమాధిని చూసి సాంత్వన పొందారు.

తమిళనాడుకు చెందిన రామసుందరం అలియాస్‌ పూంగుండ్రన్‌ తన భార్య రాధాబాయితో కలిసి చాలా ఏళ్ల కిందట మలేషియా వెళ్లారు. అక్కడ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ 1967లో మరణించారు. అప్పటికే రాధాబాయి గర్భిణి. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని, భర్తకు అంత్యక్రియలు చేయించి, అక్కడే సమాధిని కట్టించారామె. పదేపదే భర్త జ్ఞాపకాలు చుట్టుముడుతుంటే బాధను తట్టుకోలేక తమిళనాడు వచ్చేశారు. 6 నెలల తర్వాత ఆమెకు తిరుమారన్‌ జన్మించారు. 35 ఏళ్ల క్రితం రాధాబాయి మరణించారు.

తిరుమారన్‌కు ఇప్పుడు 56 ఏళ్లు. ప్రస్తుతం త‌మిళ‌నాడులోని తెన్కాశి జిల్లా వేంకటాంపట్టిలో ఉంటూ సమాజ సేవ చేస్తున్నారు. తండ్రిని చూడకున్నా.. కనీసం ఆయన సమాధినైనా దర్శించుకోవాలనే కోరిక ఆయనలో బలంగా నాటుకుంది. బతికున్నప్పుడు తల్లి చెప్పిన వివరాల ఆధారంగా మలేషియాలో తండ్రి నివసించిన ప్రాంతం, పని చేసిన పాఠశాలను గూగుల్‌ ద్వారా అన్వేషించారు.

పాఠశాల ఇ-మెయిల్‌ చిరునామా తెలియడంతో తన తండ్రి వివరాలు తెలుపుతూ… ఆయన సమాధిని కనుగొనేందుకు సాయపడాలని సందేశం పంపారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్పందించారు. రామసుందరం గురించి వివరాలు తెలిసిన మోహనరావు, పూనాట్చి అలియాస్‌ నాగప్పన్‌లను గుర్తించారు. వారంతా కలిసి రామసుందరం సమాధి ఉన్న చోటును కనుగొన్నారు. ఈ నెలలో తిరుమారన్‌ మలేషియా వెళ్లారు. ఇప్పటికీ పదిలంగా ఉన్న తండ్రి సమాధిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. నివాళిగా ఆయ‌న‌కు కొవ్వొత్తి వెలిగించి మౌనం పాటించారు.