భారత క్రికెట్లో పెను మార్పులు?

గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడడమే కాక.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది భారత జట్టు. ఈ ఏడాది పాకిస్థాన్ మీద అతి కష్టం మీద నెగ్గారు. సూపర్-12 కూడా దాటారు. కానీ సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడి నిష్క్రమించారు. పేరుకు ప్రపంచ అత్యుత్తమ జట్లలో ఒకటి. కానీ పెద్ద టోర్నీలు ఏవి వచ్చినా ప్రదర్శన అంతంతమాత్రం.

ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్‌లో కూడా టీమ్ ఇండియా పెర్ఫామెన్స్ పేలవమే. పేరు గొప్ప ఊరు దిబ్బ టైపు ఆటగాళ్లను నమ్ముకుని భారత జట్టు దారుణంగా దెబ్బ తింటోందన్నది స్పష్టం. ఓవైపు ఇంగ్లాండ్ లాంటి జట్లు రోజు రోజుకూ భీకరంగా తయారవుతుంటే.. భారత జట్టు బలహీనంగా తయారవుతోంది. ప్రపంచకప్‌లో వైఫల్యం తర్వాత ప్రక్షాళన చేపట్టకపోతే జట్టు మెరుగపడదని బీసీసీఐ బలంగానే ఫిక్సయినట్లుగా కనిపిస్తోంది.

దిద్దుబాటు చర్యల్లో భాగంగా ముందు సెలక్షన్ కమిటీ మీద వేటు వేసింది. గత రెండు టీ20 ప్రపంచకప్‌లకూ జట్టును ఎంపిక చేసిన చేతన్ శర్మ నేతృత్వంలోని కమిటీకి మొత్తంగా ఉద్వాసన పలికింది. వీరి వల్ల మళ్లీ భారత జట్టులో కోటా విధానం వచ్చిందని, కొందరు ఆటగాళ్ల పెర్ఫామెన్స్ బాగా లేకున్నా జట్టులో చోటు దక్కిందనే అభిప్రాయాలున్నాయి. అందుకే సెలక్షన్ కమిటీని మొత్తంగా తప్పించేసింది బీసీసీఐ. సెలక్షన్ కమిటీ విషయంలోనే ఇంత కఠినంగా ఉంటే.. ఇక జట్టు విషయంలో బీసీసీఐ ఏం చేయబోతోందన్నదీ తెలిసిపోతోంది.

టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ మీద వేటు పడడం లాంఛనమే అంటున్నారు. అలా జరగకపోయినా రోహితే తప్పుకుంటాడని సమాచారం. ఆల్రెడీ న్యూజిలాండ్ సిరీస్‌కు హార్దిక్ పాండ్య తాత్కాలిక కెప్టెన్‌గా వెళ్లాడు. అతనే పూర్తి స్తాయిలో పగ్గాలు అందుకోవడం పక్కా అని తెలుస్తోంది. కేఎల్ రాహుల్‌ను జట్టు నుంచి తప్పించడం, రోహిత్ కూడా జట్టుకు దూరం కావడం ఫిక్స్ అని తెలుస్తోంది. కోహ్లి సంగతే తేలాల్సి ఉంది. అశ్విన్, దినేశ్ కార్తీక్, షమి, భువనేశ్వర్ లాంటి సీనియర్లకు మళ్లీ టీ20 జట్టులో చోటు దక్కకపోవచ్చు. 2024 ప్రపంచకప్ దిశగా యువ జట్టును తీర్చిదిద్దే ప్రక్రియ మొదలైనట్లే తెలుస్తోంది.