ప్రపంచకప్‌లో ఇవేం ట్విస్టులురా బాబూ

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో బెస్ట్ టోర్నీ ఏది అంటే అందరికీ 2007 ఇనాగరల్ ఎడిషనే గుర్తుకు వస్తుంది ఆ టోర్నీలో ఇండియా-పాకిస్థాన్ మధ్య బౌలౌట్.. యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు.. ఫైనల్లో తీవ్ర ఉత్కంఠ మధ్య ఇండియా గెలవడం లాంటి మరపురాని ఉదంతాలు ఎన్నో గుర్తుకు వస్తాయి.

ఇండియా కప్పు గెలవడం అన్నిటికంటే మధురమైన విషయం. ఆ టోర్నీ చాలా హోరాహోరీగా జరిగి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. మళ్లీ ఏ టీ20 ప్రపంచకప్ కూడా ఆ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదనే చెప్పాలి.

కానీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న పొట్టి కప్పు 2007 టోర్నీని మించిపోయేలా కనిపిస్తోంది. ఈ టోర్నీ ఆరంభం నుంచి సంచలనాలే సంచలనాలు. ఎన్నో హోరాహోరీ పోరాటాలు.. సెమీస్ రేసు విషయంలో తీవ్ర ఉత్కంఠ చూస్తున్నాం. మ్యాచ్ మ్యాచ్‌కు రేసు రసవత్తరంగా మారిపోతూ వచ్చింది.

వెస్టిండీస్.. స్కాట్లాండ్ చేతిలో ఓడిపోయి గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. శ్రీలంక నమీబియా చేతిలో ఓడిపోవడం పెద్ద షాక్. ఇక టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఏకంగా 89 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం పెద్ద షాక్. తర్వాత ఇంగ్లాండ్.. ఐర్లాండ్ చేతిలో ఓడింది.

పాకిస్థాన్.. జింబాబ్వే చేతిలో షాక్ తింది. సొంతగడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆడుతూ ఆస్ట్రేలియా సెమీస్ చేరకపోవడం అనూహ్యం. ఇక సూపర్-12 దశ చివరి రోజైన ఆదివారం మ్యాచ్‌లు ఏకపక్షం అని అంతా అనుకున్నారు.

కానీ భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.30కి మొదలైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా లాంటి పెద్ద జట్టు.. నెదర్లాండ్స్ చేతిలో షాక్ తినడం అన్నిటికంటే పెద్ద సంచలనం. దీంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఫలితంతో పనైపోయిందనుకున్న పాకిస్థాన్ మళ్లీ సెమీస్ రేసులోకి వచ్చింది. ఒక ప్రపంచకప్‌లో ఇన్ని సంచలనాలు, ఇన్ని ట్విస్టులు నభూతో అనే చెప్పాలి.