భార్య ఉరేసుకుంటుంటే.. వీడియో తీసిన శాడిస్ట్ భ‌ర్త‌

Suicide
Suicide

భార్యా భ‌ర్త‌ల‌న్నాక‌.. చికాకులు.. చిన్న‌పాటి గొడ‌వ‌లు కామ‌నే. అయితే.. మూడు ముళ్ల బంధాన్ని అంత తొంద‌ర‌గా తెంచేసుకునేందుకు 85 శాతం మంది దంప‌తులు ఇష్ట‌ప‌డ‌రు. ఏదో ఒక విధంగా స‌ర్దుకు పోతారు. కానీ, ఏమైందో ఏమో.. ఓ భార్య కుటుంబ క‌ల‌హాల‌తో ఉరేసుకుంది. అయితే.. ఇది భ‌ర్త స‌మ‌క్షంలోనే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ స‌మ‌యంలో ఎంత కోపం ఉన్నా.. ఏ భ‌ర్త అయినా.. భార్య చేస్తున్న చ‌ర్యను అడ్డుకుంటాడు. కానీ, ఈ ఎపిసోడ్‌లో అలా జ‌ర‌గ‌లేదు. భార్య ఉరేసుకుంటుంటే.. ఆ భ‌ర్త శాడిస్టు మాదిరిగా.. వీడియో తీశాడు. తీవ్ర క‌ల‌క‌లం రేపిన ఈ ఘ‌ట‌న‌.. స‌భ్య స‌మాజం.. ముఖ్యంగా భార్య అంటే ప్రేమ ఉన్న వారు.. అవాక్క‌య్యేలా చేసింది.

ఎక్క‌డ.. ఎందుకు?

యూపీలోని కాన్పూరు ప‌ట్ట‌ణానికి చెందిన శోభిత గుప్తా, సంజీవ్‌లు భార్యాభ‌ర్త‌లు. కొంత‌కాలంగా వీరి మ‌ధ్య చిన్న చిన్న గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో శోభిత‌.. గ‌తంలో ఒక సారి ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించింది. అయితే.. అది విఫ‌ల‌మైంది. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా భ‌ర్త ఇంట్లో ఉండ‌గానే.. బెడ్ రూంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే.. ఈ విష‌యం తెలిసిన‌.. సంజీవ్‌.. ఏమాత్రం.. భార్య ప‌ట్ల మాన‌వ‌త్వం చూప‌కపోగా.. ఆత్మ‌హ‌త్య‌ను వీడియో తీశాడు.

అనంత‌రం, శోభిత తల్లిదండ్రుల‌కు ఫోన్ చేసి.. ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. దీంతో షాక్ కు గురైన ఆమె తల్లిదండ్రులు వెంటనే కూతురి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆమె మృతదేహం మంచంపై పడి ఉండడాన్ని గుర్తించారు. అయితే.. ఇక్క‌డ మ‌రోషాకింగ్ ఘ‌ట‌న కూడా చోటు చేసుకుంది. భార్య మంచంపై విగ‌త‌జీవిగా ప‌డిపోతే.. క‌నీసం.. ఆసుప‌త్రికి కూడా తీసుకువెళ్లాల‌ని భ‌ర్త భావించ‌లేదు. ఉరేసుకుంటుంటే.. వీడియో తీసిన భ‌ర్త‌కు.. ఈ స్పృహ ఉంటుంద‌ని ఎలా అనుకుంటాం!!

“మేము ఇంటికి చేరుకున్నప్పుడు, మా కుమార్తె మృతదేహం మంచం మీద పడి ఉంది. సంజీవ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బదులుగా ఆమెను అటూ, ఇటూ తిప్పుతున్నాడు. మేము వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాం, అక్కడ ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. అప్పుడు సంజీవ్ మాకు వీడియో చూపించాడు. ఆమె ఇంతకు ముందు కూడా ఉరి వేసుకోవడానికి ప్రయత్నించిందని అతను చెప్పాడు” అని శోభిత తండ్రి రాజ్‌కిషోర్ చెప్పారు. పోలీసులు శోబిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. వీడియోతో సహా మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ అనూప్ సింగ్ తెలిపారు.

సేమ్ టు సేమ్ మ‌న ద‌గ్గ‌ర కూడా

యూపీలో చోటు చేసుకున్న ఇలాంటి ఘ‌ట‌నే గ‌త ఏడాది సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది. భర్త ఎదుటే ఉరివేసుకుని భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుంటే ఆపాల్సింది పోయి వీడియో తీశాడు ఆ భర్త. ఆ తరువాత ఈ వీడియో వైరల్ కావడంతో… విషయం తెలుసుకున్న పోలీసులు భర్త పెంచలయ్యను అరెస్టు చేశారు. మృతురాలిని ఆత్మకూరు మెప్మా లో రిసోర్స్ పర్సన్ కొండమ్మగా గుర్తించారు.

కాగా, పెంచలయ్య ఈ జనవరిలో భార్య సమాధి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అయితే ఇదంతా సెల్ఫీ తీసుకుని, వాట్సాప్ లో షేర్ చేయడంతో సంచలనంగా మారింది. పెంచలయ్య ఆత్మకూరులోని ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. భర్త వేధింపులు భరించలేక భార్య కొండమ్మ నిరుడు సెప్టెంబర్ 21న ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో భార్య సమాధి వద్దకు వెళ్లిన పెంచలయ్య.. తన భార్య చావుకు, తన చావుకు ఆరుగురు కారణమంటూ సూసైడ్ నోట్ రాయడం గమనార్హం.

ఆ తర్వాత పురుగుల మందు తాగడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఆ వీడియో చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఎస్సై శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని వైద్యం నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. ప్రధమ చికిత్స తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం నెల్లూరుకు తరలించారు.