అన్నంతపనీ చేసిన రష్యా

ఉక్రెయిన్లోని నాలుగు ప్రధాన ప్రాంతాలను కలిపేసుకుంటున్నట్లు ప్రకటించిన రష్యా అన్నంతపనీ చేసింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య గడచిన ఎనిమిది నెలలుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో విజేతగా చివరకు ఏ దేశం నిలుస్తుందో కూడా ఎవరు చెప్పలేకున్నారు. ఈ నేపధ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ఉక్రెయిన్లోని నాలుగు కీలకమైన ప్రాంతాలను రష్యాలో కలిపేసుకోవాలని.

డోనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో విలీనం చేసేసుకోవాలని పుతిన్ అనుకున్నారు. వెంటనే పై ప్రాంతాల్లో ప్రజాభిప్రాయం సేకరించారు. నూటికి నూరుశాతం ఉక్రెయిన్లో నుండి రష్యాలో కలిసిపోవటానికి జనాలంతా సిద్ధంగా ఉన్నారని రెఫరెండంలో బయటపడింది. రెఫరెండం ప్రక్రియ మొత్తం రష్యా మిలిటరీ ఆధ్వర్యంలోనే జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో జరిగినా జనాలంతా రష్యాలో కలిసిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు అర్ధమైంది.

నిజానికి పై నాలుగు ప్రాంతాలు ఇపుడు ఉక్రెయిన్ కు చాలా కీలకమైనది. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార లావాదేవీలకు ఖేర్సన్ ఓడరేవు నగరం చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే రష్యా రెఫరండం మొదలుపెట్టిందో వెంటనే అమెరికాతో పాటు నాటో దేశాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. అయితే పుతిన్ ఎవరి అభ్యంతరాలను కనీసం లెక్కకూడా చేయలేదు. తన రెఫంరెండం పూర్తిచేసి అభిప్రాయాల ఆధారంగా పై నాలుగు ప్రాంతాలను రష్యాలో కలిపేసుకున్నట్లు రష్యా అధికారికంగా గురువారం ప్రకటించేసింది.

విలీన ప్రక్రియకు శుక్రవారం అవసరమైన సాంకేతిక ప్రక్రియను పూర్తి చేయబోతోంది. పై నాలుగు ప్రాంతాల్లోని పాలకులంతా విలీన ప్రక్రియ లాంఛనంపై సంతకాలు చేయబోతున్నారు. మాస్కోలో ఇదే విషయమై పెద్ద కార్యక్రమం జరగబోతోంది. జరుగుతున్నది చూస్తున్న నాటో దేశాలు రష్యాపై మరిన్ని ఆంక్షలను విదించబోతున్నది. అయితే ఏ ఆంక్షలను కూడా పుతిన్ పట్టించుకోవటంలేదు. తాను ఏమి చేయాలని అనుకుంటున్నారో దాన్ని బాహాటంగానే చేసుకుపోతున్నారు. మరి నాలుగు ప్రాంతాలు విలీనం అయిపోయిన తర్వాత ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాల్సిందే.