కోమాలో ఉన్నాడ‌ని.. 18 నెల‌లుగా శ‌వాన్ని ఇంట్లోనే పెట్టుకుని.. !!

ఇదొక చిత్రమైన సంఘటన. అంత‌కుమించి.. హృద‌య విదార‌క ఘ‌ట‌న కూడా. ఏడాది కింద‌టే మ‌ర‌ణించిన కుటుంబ స‌భ్యుడిని ఆయ‌న బంధువులు.. ఇంకా కోమాలోనే ఉన్నార‌ని.. భావించి ఇంట్లోనే పెట్టుకున్నారు. ఆయ‌న ఎప్పుడో ఒక‌ప్పుడు క‌న్ను తెరుస్తార‌ని.. ఆశ‌గా ఎదురు చూశారు. కానీ, 18 నెల‌లు గ‌డిచినా ఆయ‌న‌లో చ‌ల‌నం లేదు. ఎందుకంటే.. ఆయ‌న అప్ప‌టికే తుదిశ్వాస విడిచిపెట్టారు.

పోనీ.. ఈ కుటుంబం ఏమైనా నిరక్ష‌రాస్య‌త‌తో బాధ‌ప‌డుతోందా? అంటే.. ఉన్న‌త‌స్థాయిలో ఉన్న కుటుంబ‌మే పైగా.. చ‌నిపోయిన వ్య‌క్తికూడా.. ఆదాయ‌ప‌న్ను శాఖ‌లో ఉద్యోగి! అయితే.. ఆయన భార్య మాన‌సిక స‌మ‌స్య‌ల కార‌ణంగానే ఇలా వ్య‌వ‌హ‌రించార‌ని.. అధికారులు గుర్తించారు.

ఈ ఘ‌ట‌న స‌ర్వత్రా విస్మ‌యాన్ని.. బాధ‌ను కూడా క‌లిగించింది. వివ‌రాలు.. పోలీసులు తెలిపిన ఇవీ.. ఢిల్లీలోని రావ‌త్‌పూర్ ప్రాంతానికి చెందిన విమ‌లేష్ దీక్షిత్‌.. ఆదాయ‌ప‌న్నుశాఖ‌లో ప‌నిచేసేవారు. అయితే.. గ‌త ఏడాది ఏప్రిల్ 22న ఆయ‌న కార్డియాక్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కారణంగా అక‌స్మాత్తుగా.. గుండెపోటుకు గురై.. ఢిల్లీలోని లాలాల‌జ‌ప‌తిరాయ్‌ ఆసుపత్రిలో చేరారు. ఆ వెంట‌నే ఆయ‌న ఆరోగ్యం విష‌మించి తుదిశ్వాస విడిచారు.

అయితే దీక్షిత్‌ కోమాలో ఉన్నాడని భావించిన ఆయ‌న‌ కుటుంబ సభ్యులు అంత్యక్రియలను నిర్వహించడానికి ఇష్టపడలేదని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అలోక్ రంజన్ తెలిపారు. “కాన్పూర్ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు నాకు సమాచారం అందించారు, కుటుంబ పెన్షన్ ఫైల్‌ ఒక్క అంగుళం కూడా కదలనందున ఈ విషయంపై దర్యాప్తు చేయాలని అభ్యర్థించారు” అని ఆయన చెప్పారు.

దీంతో పోలీసులు, మేజిస్ట్రేట్‌తో పాటు ఆరోగ్య అధికారుల బృందం రావత్‌పూర్ ప్రాంతంలోని దీక్షిత్ ఇంటికి చేరుకున్నప్పుడు, అతని కుటుంబ సభ్యులు అతను సజీవంగా ఉన్నారని, కేవ‌లం కోమాలో ఉన్నారని తెలిపిన‌ట్టు రంజన్ చెప్పారు.

కుటుంబ సభ్యులను ఒప్పించిన త‌ర్వాత‌ మృతదేహాన్ని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఆరోగ్య బృందాన్ని అనుమతించారు. అక్కడ నిర్వ‌హించిన‌ వైద్య పరీక్షల్లో అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అప్ప‌టికే మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గత సంవత్సరం మరణించిన ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగి కుటుంబం అతను కోమాలో ఉన్నట్లు భావించి దాదాపు 18 నెలల పాటు అతని మృతదేహాన్ని ఇంట్లో ఉంచినట్లు అధికారులు గుర్తించారు.

మానసిక స్థిమితం లేని ఆయ‌న భార్య ప్రతిరోజూ ఆయ‌న‌ శరీరంపై ‘గంగాజలాన్ని` చిలకరించి, కోమా నుండి బయటపడటానికి పూజ‌లు కూడా చేస్తున్న‌ట్టు గుర్తించామ‌న్నారు. పొరుగు వారిని కూడా ఆమె అలానే న‌మ్మించార‌ని అన్నారు. మొత్తానికి.. వైద్య ప‌రీక్ష‌ల అనంతరం.. ఆయ‌న‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించే కుటుంబాన్ని ఒప్పించే ప‌నిలో ఉన్నామ‌న్నారు.