హైదరాబాద్ లో.. వేటకొడవలితో గర్భిణి హత్య

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు…అని ప్రజా కవి గోరటి వెంకన్న రాసిన మాటలు అక్షర సత్యాలు. ఈ కలికాలంలో చిన్న చిన్న కారణాలతో, క్షణికావేశంలో కట్టుకున్న వారిని సైతం కసాయిగా మారి కడతేరుస్తున్న వైనాలు ఎన్నో చూశాం. ఆస్తికోసమో, ప్రేమ నిరాకరించారనో, పగ, ప్రతీకరామో…ఇలా కారణమేదైనా సరే సాటి మనిషిని పాశవికంగా హతమార్చడానికి కూడా కొందరు వెనుకాడడం లేదు.

మానవ మృగాలుగా మారి తోటి మనిషి ప్రాణాలు బలి తీసుకోవాలన్న రక్తదాహంతో కొందరు రక్త సంబంధాలను కూడా విస్మరిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్లో నిండు గర్భిణిని ఆమె ఆడపడుచు భర్త అమానుషంగా హత్య చేసిన వైనం మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వి.వెంకట రామకృష్ణ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్రవంతి, కూతురు చైత్ర ఉన్నారు. ప్రస్తుతం స్రవంతి ఎనిమిది నెలల నిండు గర్భిణి. 2020లో తన చిన్నమ్మ కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కావూరు శ్రీరామకృష్ణతో పెళ్లి జరిపించడంలో వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా వ్యవహరించారు.

అయితే, శ్రీరామకృష్ణ అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో లక్ష్మి ప్రసన్న పుట్టింటి వారికి ఫిర్యాదు చేసింది. దీంతో, ఇరు కుటుంబ సభ్యులు, పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి పరిష్కారం చేసిన ఫలితం లేదు. దీంతో, లక్ష్మీ ప్రసన్న హైదరాబాద్ వచ్చి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ భర్తకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత, తన భర్త అత్తింటి వారిపై లక్ష్మీ ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శ్రీరామ కృష్ణకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

తనపై లక్ష్మీ ప్రసన్న కేసు పెట్టడం వెనుక వెంకట రామకృష్ణ దంపతులే ఉన్నారని శ్రీరామ కృష్ణ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బావమరిదిని హత్య చేయాలని వేటకొడవలి తీసుకొని సెప్టెంబరు 6న వెంకట రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు. అయితే, ఆ సమయంలో వెంకట రామకృష్ణ తన కుమార్తెను స్కూల్ నుంచి తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న స్రవంతిని చంపేందుకు శ్రీరామకృష్ణ నిర్ణయించుకున్నాడు.

ఆమె కేకలు వేస్తూ బయటకు వెళ్ళేందుకు ప్రయత్నించినా వేటాడి వెంటాడి మరీ వేటకొడవలితో కిరాతకంగా ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న బాధితురాలని పక్కింటి వారు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ ఆరో తేదీ రాత్రి స్రవంతి మృతి చెందింది. సెప్టెంబరు 7న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.