ఎలాన్ మస్క్ కు కేంద్రం పెద్ద షాక్

దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించాలని ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్న స్పేస్ ఎక్స్ ఛైర్మన్ ఎలాన్ మస్క్ కు కేంద్ర ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. మస్క్ ప్రతిపాదించిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను దేశంలోకి అనుమతించలేమని కేంద్రం తేల్చి చెప్పేసింది. ఎలాగూ అనుమతులు వచ్చేస్తాయన్న ధీమాతో కొన్ని ప్రాంతాల్లో స్పేస్ ఎక్స్ సంస్ధ కొందరిని ప్రీలాంచ్ చందాదారులగా చేర్చుకున్నదట. వీళ్ళ దగ్గరనుండి వేలాది రూపాయలు వసూలు కూడా చేసేసింది.

కేంద్రం అనుమతివ్వటమే ఆలస్యం దేశమంతా ఒకేసారి ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వటానికి మస్క్ భారీ ప్రణాళికలతో ఎప్పటినుండో రెడీగా ఉన్నారు. అయితే మనదేశంలో బిజినెస్ చేసుకోవాలని కోరికతో ఉన్న మస్క్ ఏకంగా కేంద్రానికే కొన్ని షరతులు పెట్టారట. వ్యాపారం చేసుకోవాలని అనుకునేవారు ఎవరూ ఎదుటివారికి షరతులు పెట్టరు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో మాట్లాడుకుని వ్యాపారం ప్రారంభించుకుంటారు. జనాల్లో బాగా పాతుకుపోయిన తర్వాత తమిష్టం వచ్చినట్లు నిబంధనలు మార్చుకుంటారు.

కానీ మస్క్ మాత్రం కేంద్రానికి నిబంధనలు పెట్టారట. ఇదే సమయంలో అమెరికాకే చెందిన మరో శాటిలైట్ ఇంటర్నెట్ అందించే సంస్ధ హ్యూస్ కమ్యూనికేషన్స్ కేంద్రాన్ని అప్రోచ్ అయ్యిందట. కేంద్రంతో మాట్లాడుకుని దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించేందుకు అవసరమైన అన్ని అనుమతులను తెచ్చేసుకుంది. హ్యూస్ సేవలు మొదలైతే మహా నగరాలు, నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చేయటం ఖాయం.

ఎందుకంటే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు కేబుల్స్ అవసరం ఉండదు. కాకపోతే మొదట్లో కనెక్షన్ ఖరీదు ఎక్కువుండచ్చంతే. కేబుల్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ సేవలకన్నా శాటిలైట్ ద్వారా అందే ఇంటర్నెట్ సేవల్లో నాణ్యత చాలా ఎక్కువ. ఇదే సమయంలో ఎలాంటి అంతరాయాలు లేని సేవలను వినియోగదారులు అందుకుంటారు. ఇండియాలో తన సేవలను అందించేందుకు హ్యూస్ ఇస్రోతో ఒప్పందం కూడా చేసుకున్నది. లాంఛనాలు పూర్తిచేసి వీలైనంత తొందరలోనే ఇంటర్నెట్ సేవలు అందించేందుకు హ్యూస్ కమ్యూనికేషన్ రెడీ అయిపోతోంది. దీంతో మస్క్ కు పెద్ద షాక్ కొట్టినట్లయ్యింది.