70 ఏళ్ల త‌ర్వాత‌.. బ్రిట‌న్‌లో సంచ‌ల‌న మార్పులు

సూర్యుడు అస్త‌మించ‌ని బ్రిటీష్ సామ్రాజ్యం బ్రిట‌న్‌లో సంచ‌ల‌న మార్పుల‌కు శ్రీకారం చుట్ట‌నున్నారు. క‌రెన్సీ, పాస్ పోర్టు స‌హా.. జాతీయ గీతాన్ని కూడా మార్చేయ‌నున్నారు. దీనికి కార‌ణం.. ఏడు దశాబ్దాల పాటు బ్రిట‌న్‌ను పాలించిన రాణి ఎలిజబెత్‌-2 తుదిశ్వాస విడ‌వ‌డ‌మే. రాణి ఎలిజబెత్‌ మరణంతో దేశంలో అనేక మార్పులు రానున్నాయి. జాతీయ గీతం దగ్గర్నుంచి.. దేశ కరెన్సీ, పాస్‌పోర్టు, స్టాంప్‌లు, పోస్ట్‌బాక్సులు మారనున్నాయి.

గత 1100 ఏళ్లుగా బ్రిటన్‌లో రాయల్‌ మింట్‌ కరెన్సీని విడుదల చేస్తూ వస్తోంది. సామ్రాజ్యాధినేత ముఖచిత్రాలతో నాణేలు, కరెన్సీ నోట్లను ముద్రిస్తోంది. 1952లో రాణిగా ఎలిజబెత్‌ 2 పట్టాభిషేకం తర్వాత బ్రిటన్‌, కామన్వెల్త్‌ దేశాల్లో ఆమె చిత్రంతో రూపొందించిన నాణేలు, కరెన్సీ నోట్లు విడుదల చేశారు. ప్రతి దశాబ్దానికోసారి ఆమె గౌరవార్థం కొత్త నాణేలను రూపొందిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు బ్రిటన్‌ రాజుగా కింగ్‌ ఛార్లెస్‌ 3 పట్టాభిషేకం చేయనుండంతో దేశ కరెన్సీలో మార్పులు జరగనున్నాయి.

ఛార్లెస్‌ ఫొటోతో నాణేలు, కరెన్సీ నోట్లను ముద్రించనున్నారు. అంతేగాక దేశ కరెన్సీ నోట్లపై రాణి ఎలిజబె త్‌ చిత్రం కుడివైపున ఉండగా.. కొత్తగా ముద్రించే నోట్లపై ఛార్లెస్‌ చిత్రం ఎడమవైపున ఉండనుంది. కరె న్సీ నోట్లపై రాణి లేదా రాజు చిత్రాలు అంతకుముందు పాలించిన వారికి అభిముఖంగా ఉండటం గత 300 ఏళ్లుగా వస్తోన్న సంప్రదాయం. 1956 నుంచి బ్యాంక్‌ ఆఫ్ ఇంగ్లాండ్‌ విడుదల చేసే కరెన్సీ నోట్లపైనా రాణి ఎలిజబెత్‌ చిత్రాలను ముద్రిస్తున్నారు.

బ్రిటన్‌ వాసులు గత 70ఏళ్లుగా ‘God saves the Queen’ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. ఇప్పుడు ఈ గీతం కూడా మారనుంది. ఛార్లెస్‌ రాజుగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో రాణి పదం స్థానంలో రాజును చేర్చనున్నారు. కొత్త జాతీయ గీతం “God save our gracious King! Long live our noble King! God save the King! Send him victorious, Happy and glorious, Long to reign over us, God save the King” ఇలా ఉండనుంది. న్యూజిలాండ్‌కూ ఇదే జాతీయ గీతంగా ఉండగా.. ఆస్ట్రేలియా, కెనడాల్లో రాజ గీతంగా ఉంది. ఇప్పుడు ఆ దేశాల్లో కూడా మారనుంది.

బ్రిటిష్‌ పాస్‌పోర్టుల్లోనూ రాణి స్థానంలో రాజు పేరును మార్చనున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ పాస్‌పోర్టులు కూడా ఈ విధంగానే మారనున్నాయి. వీటితో పాటు యూకే పోస్టల్‌ స్టాంప్‌లు, పోలీసులు ధరించే టోపీల్లోనూ రాణి చిహ్నం మారనుంది. బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ బయట విధుల్లో ఉండే క్వీన్స్‌ గార్డ్‌ కూడా ఇక కింగ్‌ గార్డ్‌గా పేరు మార్చుకోనుంది. మొత్తానికి రాణి మ‌ర‌ణంతో ఈ మార్పులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు. వీటికిగాను దాదాపు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం(భార‌త క‌రెన్సీలో).