డెడ్ లైన్: కాసులే కాసులు

ప్రస్తుత ఆర్థిక సంవ‌త్స‌రం చిట్టాప‌ద్దులు అప్పుడే మొద‌ల‌యిపోయాయి. ఇదే స‌మ‌యాన గ‌త  ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి చిట్టా ప‌ద్దులు అనగా ఐటీ రిట‌ర్న్స్  లెక్క తేలాల్సి ఉంది. ఆఖ‌రికి నిన్న‌టి వేళ గ‌డువు ముగిసే స‌మ‌యానికి చాలా ఎక్కువ మందే స్పందించారు. దేశ రాజ‌ధానిలో ఆదాయ‌పు ప‌న్ను చెల్లించేందుకు అర్హ‌త ఉన్న‌ వారంతా అనూహ్య స్థాయిలో ఆఖ‌రి ఆదివారం అన‌గా జూలై 31న స్పందించారు. ఒక్క నిన్న‌టి రోజునే 68 – 75 లక్ష‌ల ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు అయ్యాయి. 

అదేవిధంగా మ‌రో ఐదు ల‌క్షలు అద‌నంగా ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని సంబంధిత వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గ‌డువు పెంచ‌డంతో ఆరు ల‌క్ష‌ల మంది జ‌రిమానాతో స‌హా చెల్లించేందుకు ఆస‌క్తి చూపించార‌న్న వార్త‌లూ ఉన్నాయి. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ప‌న్నుల చెల్లింపు ఈ ఏడాది బాగానే ఉంది. అందుకు త‌గ్గ అభివృద్ధి, అందుకు త‌గ్గ విధంగా జీవ‌న ప్ర‌మాణాల మెరుగుదల లేదా పెరుగుద‌ల ఉంటే ఎంతో మేలు.

వాస్తవానికి కేంద్రానికి  అయినా రాష్ట్రానికి అయినా ప్ర‌త్యక్ష, ప‌రోక్ష ప‌న్నుల కార‌ణంగానే అధిక ఆదాయం వ‌స్తోంది. అటు జీఎస్టీ కానీ ఇటు ఐటీ కానీ ప్ర‌తి ఏటా మంచి న‌మోదునే చూపిస్తున్నాయి. సంబంధిత ప‌న్నుల అధికారుల తీరు కూడా బాగానే ఉంటుంది. ప‌న్ను వ‌సూలుకు సంబంధించి గ‌తం క‌న్నా పార‌ద‌ర్శ‌క‌త పెర‌గ‌డంతో అప్ప‌టి క‌న్నా ఇప్పుడు వేగంగా చెల్లించే అవ‌కాశాలు కూడా పెర‌గ‌డంతో మాన్యువ‌ల్ పేమెంట్స్ కూడా బాగానే త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఆన్లైన్ ఫైలింగ్ కు మంచి స్పంద‌నే  వ‌స్తోంది.

ఆలెక్క‌న నిన్న‌టి వేళ దేశ రాజ‌ధానిలో ఐటీ  రిట‌ర్న్స్ అన్న‌వి అనూహ్య రీతిలో దాఖ‌లు అయి ఉండ‌వ‌చ్చు. అదేవిధంగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం అప‌రాధ రుసుముతో క‌లిపి క‌ట్టే వారి సంఖ్య కూడా ఈ సారి అనూహ్యంగానే ఉండనుంద‌ని తెలుస్తోంది. ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల లోపు ఆదాయం ఉన్న‌వారు వెయ్యి రూపాయ‌లు, అంత‌కుమించి ఆదాయం ఉన్న వారు ఐదు వేల రూపాయ‌ల చొప్పున ఆదాయ‌పు ప‌న్నుకు సంబంధించి అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.  ఒక అంచనా ప్రకారం మరో కోటి ఐటీ రిటర్న్స్ దాఖలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.