జెలెన్ స్కీ పై మండిపోతున్న నెటిజన్లు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై నెటిజన్లు మండిపోతున్నారు. ఒకవైపు దేశంపై రష్యా బాంబులు కురిపించి నాశనంచేసేస్తోంది. మరోవైపు ఇప్పటికే మామూలుజనాలతో పాటు సైనికులు కూడా వేలాదిమంది చనిపోయిరు. దేశంలో చాలాభాగం సర్వనాశనమైపోయింది. ఇలాంటి సమయంలోనే జెలెన్ స్కీ తన భార్యతో కలిసి ఫొటో షూట్ కి దిగారు. అంతర్జాతీయ మ్యాగజైన్ వోగ్ కు ఇంటర్వ్యూ కోసమని తన భార్యతో కలిసి ఫొటో షూట్ దిగటం ఇపుడు ప్రపంచదేశాల్లో సంచలనంగా మారింది.

ఒకవైపు ఉక్రెయిన్ కు మద్దతుగా చాలాదేశాలు ఆయుధాలను అందిస్తున్నాయి. ఇదే సమయంలో యుద్ధాన్ని విరమింపచేసేందుకు టర్కీ లాంటి దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. మరీ పరిస్థితుల్లో వోగ్ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్ అవసరమా ? అని నెటిజన్లు మండిపోతున్నారు. మొన్నటి వరకు దేశంలో జెలెన్ స్కీ అంటు అందరూ మెచ్చుకుంటున్నారు. విదేశీ అధినేతలను ఉక్రెయిన్ కు పిలిపించి యుద్ధ పరిస్థితులను వివరించారు. నాటో దేశాల నుండి అత్యంత ఆధునిక ఆయుధాలను తెప్పించుకున్నారు.

పరిమితమైన సైనికులతోనే విదేశాలిచ్చిన ఆయుధాలతో తెగించి పోరాడటంలో జెలెన్ స్కీ ఇచ్చిన స్పూర్తిని చాలా దేశాలు అభినందించాయి. అయితే అదంతా వోగ్ పత్రిక ఇంటర్వ్యూ సందర్భంగా గాలికి కొట్టుకుపోయింది. అసలు వోగ్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటు ప్రపంచదేశాలు అధ్యక్షుడిని నిలదీస్తున్నాయి. యుద్ధం సదర్భంగా ఎప్పుడేమి జరుగుతుందో తెలీని పరిస్ధితుల్లో అధ్యక్షుడి దంపతులకు వోగ్ మ్యాగజైన్లో ఇంటర్వ్యూ కావాల్సొచ్చిందా అంటు నెటిజన్లు కూడా రెచ్చిపోతున్నారు.

ఇదే సమయంలో కొందరు మద్దతుగా కూడా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ సంఖ్య చాలా పరిమితమనే చెప్పాలి. ఉక్రెయిన్లోని తాజా పరిస్ధితులు ప్రపంచానికి తెలియాలని చెప్పి జెలెన్ స్కీ భార్య ఒలెనా యుద్ధ ట్యాంకులు, సైనికులతో కలిసి ఫొటోలు దిగారు. వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో ఒలేనా పోస్టుచేయటం మరో దుమారాన్ని రేపుతోంది. మరి తాజా వివాదానికి జెలెన్ స్కీ దంపతులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి.