హీరో రాజా.. పాస్టర్ రాజా ఎందుకయ్యాడు?

2000-2010 మధ్య తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలోనే సినిమాలు చేశాడు రాజా. ముఖ్యంగా ఆనంద్, వెన్నెల, ఒక ఊరిలో లాంటి చిత్రాలు అతడికి మంచి పేరే తెచ్చిపెట్టాయి. హీరోగా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్న సమయంలో ఉన్నట్లుండి అతడి దారి మారిపోయింది. ముందుగా రాజకీయాల్లో అడుగు పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తర్వాతేమో ఆ ఫీల్డ్ నుంచి పక్కకు వెళ్లిపోయి క్రిస్టియానిటీని స్వీకరించాడు. పాస్టర్ అయ్యాడు.

ఇప్పుడు పూర్తిగా ఆ మార్గంలోనే నడుస్తూ క్రిస్టియన్ మీటింగ్స్‌లో స్పిరిచువల్ స్పీకర్‌గా కనిపిస్తున్నాడు. ఇటీవల అలాంటి మీటింగ్‌లోనే ఒకదాంట్లో సినిమాల గురించి మరీ తీసిపడేసేలా మాట్లాడుతూ.. ‘పనికిమాలిన సినిమాలు ఎందుకు చూస్తారయ్యా’ అని కామెంట్ చేయడం చర్చనీయాంశం అయింది. సినీ రంగం ద్వారా పేరు సంపాదించి.. ఇలా మాట్లాడుతున్నాడేంటి అని అంతా సోషల్ మీడియాలో ఆశ్చర్యపోయారు. ఐతే తాను సినిమాలు వదిలేసి, రాజకీయాలూ విడిచిపెట్టి ఇలా స్పిరిచువల్ స్పీకర్‌గా ఎందుకు మారాల్సి వచ్చిందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు రాజా.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరానని.. కానీ ఆయన చనిపోగానే తనకు రాజకీయాల మీద ఆసక్తి పోయిందని రాజా వెల్లడించాడు. అప్పటి సీఎం రోశయ్య తనను పార్టీలో చురుగ్గా ఉండాలని, ఎన్నికల ప్రచారానికి రావాలని కోరగా.. వైఎస్ పోవడంతోనే కాంగ్రెస్ పార్టీలో తన కథ ముగిసిందని, ఇక తాను పార్టీలో కొనసాగలేనని చెప్పి బయటికి వచ్చేశానని రాజా తెలిపాడు.

ఆ సమయంలోనే సినిమాల మీద, జీవితం మీద విరక్తి పుట్టిందని, తన డ్రైవర్ సహా కొందరు తనను మోసం చేశారని.. డ్రైవర్‌ కష్టాల్లో ఉన్నాడని 7 లక్షల రూపాయలు ఇస్తే అతను మరుసటి రోజే ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడని.. ఇలాంటి ఎదురు దెబ్బలు చాలా తగిలాయని, ఆర్థికంగా ఇబ్బంది పడ్డానని, చాలా మోసాలు చూశానని.. అసలు జీవితం అంటే డబ్బేనా ఇంకేమీ లేదా అనే ఫ్రస్టేషన్ వచ్చిందని.. ఆ టైంలోనే ఏసు ప్రభువే తన రక్షకుడు అని భావించి ఆయన మార్గంలో నడిచానని.. ఇప్పుడు తన జీవితం గొప్పగా ఉందని చెప్పాడు రాజా. తన భార్య కూడా తన బాటలోనే నడుస్తోందని.. ఒకవేళ తాను సినీ నటుడిని అయితే ఒక్క ఏడాది కూడా తనతో కలిసి జీవించేది కాదని.. ఇప్పుడు తన భవిష్యత్ మాత్రమే కాక.. జీవితం ముగిశాక కూడా తన పరిస్థితి ఏంటో తనకు తెలుసని రాజా వ్యాఖ్యానించడం గమనార్హం.