దెబ్బకు అల్లాడిపోతున్న ఉత్తరకొరియా

కరోనా వైరస్ దెబ్బకు ఉత్తర కొరియా అల్లాడిపోతోంది. దేశం మొత్తం మీద కరోనా అనుమానిత కేసులు సుమారు 8.5 లక్షలుగా రికార్డయ్యాయి. వీటిల్లో సుమారు 3.5 లక్షల మంది కరోనా నిర్ధారణై ఆసుపత్రుల్లో ఐసీయూలో వైద్యం చేయించుకుంటున్నారు. గడచిన రెండు రోజుల్లో దేశంలో కరోనా వల్ల మాత్రమే సుమారు 100 మంది చనిపోయినట్లు సమాచారం. ఇంతకాలం లేని సమస్య ఒక్కసారిగా వచ్చి మీదపడటంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు దిక్కుతోచటం లేదు.

గడచిన రెండు సంవత్సరాలుగా యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎంతగా వణికించిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఉత్తరకొరియాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని మీడియా చాలా ఆశ్చర్యంగా ప్రకటించింది. నిజానికి అప్పట్లో ఉత్తరకొరియాలో కేసులు నమోదయ్యాయో లేవో తెలీదు కానీ బయట ప్రపంచానికి మాత్రం కేసులు లేవనే ప్రభుత్వం చెప్పింది. ఉత్తర కొరియా, చైనాలో ప్రభుత్వాలు ఏ స్థాయిలో వ్యవహరిస్తాయో అందరికీ తెలిసిందే. కాబట్టి ప్రభుత్వాలు చెప్పిందే వినాలి, నమ్మాలంతే.

అయితే ఇపుడు హఠాత్తుగా సీన్ మారిపోయింది. రోజుల వ్యవధిలోనే ఉత్తరకొరియాలో లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఈనెల 12వ తేదీన దేశంలో మొదటి కేసు నమోదైతే నాలుగు రోజుల్లోనే 8 లక్షల కేసులకు ఎలా పెరిగిపోయిందో అర్ధంకాక కిమ్ లో టెన్షన్ పెరిగిపోతోంది. వైరస్ దేశంలో పాకకుండా చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించేశారు. అయినా కేసుల సంఖ్య పెరిగిపోతునే ఉంది. జనాల్లో కరోనా వైరస్ లక్షణాలను గుర్తించేందుకు ప్రభుత్వం 13 లక్షల ఆరోగ్య కార్యకర్తలను రంగంలోకి దింపింది.

నిజానికి ప్రపంచమంతా కరోనా వైరస్ విషయంలో ఒకలాగుంటే ఉత్తరకొరియా మాత్రం ఇంకోలాగుంది. అదేమిటంటే కరోనా పరీక్షలు చేయించలేదు. కరోనా వ్యాక్సిన్ జనాలకు వేయించలేదు. అవసరమైతే పనికొస్తాయని ఆసుపత్రులు, ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేయలేదు. వ్యక్సిన్ను దేశంలోకే అనుమతించలేదు. ఎందుకంటే తమదేశంలో కరోనా వైరస్ ప్రవేశించలేందనే పనికిమాలిన ప్రకటనలిచ్చారు పాలకులు. తీరా ఇపుడు లక్షల సంఖ్యలో పెరిగిపోవటంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు.