కరోనాకు చెక్ పెట్టే హైదరాబద్ ఇంజెక్షన్ వచ్చేసింది

వణికిస్తున్న కరోనా మహమ్మారి తీవ్రతను తగ్గించే మెడిసిన్ విడుదల చేయటం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ కు చెందిన మరో ప్రముఖ ఫార్మాకంపెనీ హెటిరో ఇంజెక్షన్ ను సిద్ధం చేసింది. అంతేకాదు.. దాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. కోవిఫర్ పేరుతో మార్కెట్లోకి విడుదలైన ఈ ఇంజెక్షన్ తో మహమ్మారి తీవ్రతను తగ్గించే వీలుందన్న మాట వినిపిస్తోంది. తాము మార్కెట్లోకి విడుదల చేసిన కోవిఫర్ ఇంజెక్షన్ కు సంబంధించిన వివరాల్ని హెటిరో తన ప్రకటనలో వెల్లడించింది.

కోవిడ్ 19పై పోరాటంలో భాగంగా ఇన్వెస్టిగేషన్ యాంటీ వైరల్మెడిసిన్ ఉత్పత్తి.. మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి పొందినట్లు పేర్కొంది. రిమ్డిసివిర్ హెటిరో జెనిరిక్ వెర్షన్ కు కోవిఫర్ పేరును పెట్టినట్లు చెప్పిన కంపెనీ.. దీన్ని తాము మార్కెట్లోకి తెస్తున్నట్లు పేర్కొంది.

ఈ ఇంజెక్షన్ ను లక్ష డోసుల మేర సిద్ధం చేసినట్లు పేర్కొన్న కంపెనీ.. దీని ధర ఎంత ఉంటుందన్న విషయాన్ని వెల్లడించలేదు. దీన్ని ఏ రీతిలో ఉపయోగించాలి? ఎంత డోస్ ఇవ్వాలన్న దానిపై వైద్యుల సూచనల మేరకు వ్యవహరించాలని చెబుతున్నారు. మహమ్మారి తీవ్రతను తగ్గించటంలో తాజా ఇంజెక్షన్ కీలకభూమిక పోషించే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.