అంబానీ.. అదానీల మధ్య దూరం రూ.5లక్షల కోట్లే!

ఫోర్బ్స్ జాబితా విడుదలైంది. ప్రపంచంలో టాప్ టెన్ సంపన్నుల జాబితాలో పదో స్థానంలో నిలిచిన రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏడు శాతం వ్రద్ధి రేటును సాధించినా ఆయన ఆసియా కుబేరుడిగా కొనసాగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పదో స్థానంలో నిలిచిన ఆయన సంపద 90.7 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టారు. మన రూపాయిల్లో 6.8 లక్షల కోట్లుగా చెప్పాలి.

ముకేశ్ కు దగ్గరగా వస్తున్న గౌతమ్ అదానీ సంపదనను కూడా తాజా జాబితాలో పేర్కొన్నారు. కేవలం ఏడాది వ్యవధిలో 40 బిలియన్ డాలర్ల రికార్డు మొత్తాన్ని జత చేసుకోవటం ద్వారా ముకేశ్ అంబానీకి చాలా దగ్గరగా వచ్చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజ పారిశ్రామికవేత్తల మధ్య వ్యత్యాసం కేవలం రూ.5లక్షల కోట్లు మాత్రమేనని తేల్చారు. ఒక ఆర్థిక సంవత్సరంలో 40 బిలియన్ డాలర్లను జత చేసిన గౌతమ్ అదానీకి 0.7 బిలియన్ డాలర్లను పోగేయటం పెద్ద విషయం కాదనే చెప్పాలి. అంటే.. రానున్న మరికొద్ది రోజుల్లో అంబానీ స్థానాన్ని అదానీ ఆక్రమించేసే అవకాశం ఉందని చెప్పాలి. తాజా నివేదిక ప్రకారం చూస్తే.. భారత కుబేరుడిగా ముకేశ్ అంబానీ నిలవగా.. రెండో స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు.

రానున్న పదేళ్ల కాలంలో హరిత ఇంధనం మీద భారీ పెట్టుబడులు పెట్టనున్న అంబానీ.. అదానీలు మరింత సంపదను పోగేయటం ఖాయమని చెప్పక తప్పదు. ఇక.. భారత కుబేరుల్లో మూడో స్థానంలో ఐటీ దిగ్గజం హెచ్ సీఎల్ టెక్ గౌరవ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న శివనాడార్ సంపద గత ఆర్థిక సంవత్సరంలో 22 శాతం పెరగటంతో భారత కుబేరుల్లో మూడో స్థానంలో నిలిచారు. హెచ్ సీఎల్ వ్రద్ధికి..కరోనా కారణమని చెప్పాలి. మహమ్మారి కారణంగా చాలా కంపెనీలు డిజిటల్ కు మారటంతో ఐటీ రంగం రికార్డు స్థాయి వ్రద్ధిని నమోదు చేసింది. ఇది హెచ్ సీఎల్ కు కలిసి వచ్చింది.

ఇదిలా ఉంటే.. కరోనాకు చెక్ పెట్టే కొవిడ్ టీకాను తయారు చేయటంలోనూ.. దేశ వ్యాప్తంగాపెద్ద ఎత్తున వ్యాక్సిన్ల పంపిణీలో కీలకంగా వ్యవహరించిన సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ పూనావాలా దేశంలోనే అతి పెద్ద కరోనా టీకా తయారీదారుగా కావటంతో భారీలాభాల్ని సొంతం చేసుకున్నారు. ఆయన దేశంలో అత్యంత సంపన్నుడి జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నారు. డిమార్టు అధినేత రాధాకిషన్ దమానీ ఐదో స్థానంలో నిలిచారు. ఏమైనా.. అంబానీ.. అదానీల మధ్యనున్న దూరం తగ్గిపోవటంతో ఇంతకాలం భారత కుబేరుడిగా నిలిచిన ముకేశ్ అంబానీ స్థానం మరికొద్ది రోజుల్లో మారటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ముకేశ్ అంబానీ ఏం చేస్తారో చూడాలి.