బంగారం తీసుకునేందుకు ఏటీఎంలు

ఏటీఎంలలో డబ్బులు తీసుకోవటం మనకు తెలుసు. ఆహార పొట్లాలను, మందులను, నీటిని కూడా ఏటీఎంలలో తీసుకోవచ్చని వినుంటాం. కానీ ఏకంగా బంగారాన్నే ఏటీఎంల్లో తీసుకోవటం గురించి ఎప్పుడైనా విన్నారా ? చూశారా ? ఇకనుండి హైదరాబాద్ లో బంగారం నాణాలను ఏటీఎంల్లో తీసుకోవచ్చు. హైదరాబాద్ లోని మూడు చోట్ల బంగారం నాణాలను అందించే ఏటీఎంలను ఏర్పాటు చేయబోతున్నట్లు గోల్డ్ సిక్కా అనే సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ ప్రకటించారు.

బేగంపేటలో సంస్థ ప్రధాన కార్యాలయంలో సయ్యద్ మాట్లాడుతూ బంగారం నాణాలను అందించే ఏటీఎంలు బ్రిటన్లో ఐదు, దుబాయ్ లో రెండు న్నట్లు చెప్పారు. మనదేశంలో హైదరాబాద్ లో మొట్టమొదటి బంగారం ఏటీఎంలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 45 రోజుల్లో సిటీలోని గుల్జార్ హౌస్, అబిడ్స్, సికింద్రాబాద్ ఏరియాల్లో ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నారట. క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి అవసరమైన నాణాలను తీసుకోవచ్చన్నారు.

ఏటీఎంల్లో 0.5 గ్రాముల నుంచి 1, 2, 5,10, 20, 50,100 గ్రాముల బంగారం నాణాలుంటాయన్నారు. తొందరలోనే తమ సంస్ధ తరపున ప్రీపెయిడ్, పోస్ట్ పోయిడ్ కార్డులను కూడా జారీచేయబోతున్నట్లు సయ్యద్ చెప్పారు. తాము ఏర్పాటు చేయబోయే ఏటీఎంల్లో రోజువారీ అంతర్జాతీయ ధరలు డిస్ ప్లే అవుతుందన్నారు. తాము జారీ చేస్తున్న బంగారం నాణాల నాణ్యత, గ్యారెంటీ సర్టిపికేట్లను కూడా జారీచేయబోతున్నట్లు సయ్యద్ ప్రకటించారు.

అంతాబాగానే ఉంది కానీ బంగారాన్ని అందించే ఏటీఎంల భద్రతే అసలైన తలనొప్పిగా తయారవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం డబ్బులిచ్చే ఏటీఎంలను కేటుగాళ్ళు ఎలా దొంగలించుకుని వెళుతున్నది అందరు చూస్తున్నదే. ఏటీఎంలున్న రోడ్లలో, ఏటీఎంల దగ్గర ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఏదో పద్దతిలో దొంగతనాలు జరుగుతునే ఉన్నాయి. ఏటీఎంల నుండి డబ్బులు తీసుకోవటం సాధ్యం కాకపోతే ఏకంగా ఏటీఎంలను ఎత్తుకెళ్ళిపోతున్నారు. మరిపుడు బంగారం ఏటీఎంల భద్రత విషయంలో యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో చూడాలి.