హిజాబ్ వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు

కర్ణాటకలో మొదలైన హిజాబ్‌ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు నేడు సంచలన తీర్పునిచ్చింది. హిజాబ్‌పై దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు…విద్యాసంస్థల యూనిఫాం ప్రోటోకాల్ ను విద్యార్థులంతా అనుసరించాల్సిదేనని తేల్చి చెప్పింది. హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇవాళ కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తుండగా…వివాదానికి కేంద్రబిందువైన ఉడిపి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కర్ణాటకలో మొదలైన హిజాబ్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడానికి వీల్లేదంటూ ఉడిపిలోని ఓ కాలేజ్ యాజమాన్యం అభ్యంతరం తెలిపింది.

దీంతో, హిజాబ్‌కు వ్యతిరేకంగా, అనుకూలంగా ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. హిజాబ్‌ వస్త్రధారణకు అనుమతివ్వాలంటూ ఉడుపి, కుందాపురలకు చెందిన విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్‌లో పెట్టి..ఈ రోజు తుది తీర్పునిచ్చింది.

హైకోర్ట్‌ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై అన్నారు. ప్రతి ఒక్కరూ హైకోర్ట్‌ ఆదేశాలు పాటించాలని, శాంతిని కాపాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ చదువుపై దృష్టి పెట్టాలని కోరారు. మరోవైపు, హిజాబ్‌ పై కర్నాటక హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమని మజ్లిస్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ముస్లిం బాలికలు హిజాబ్‌ ధరిస్తే ఎవరికి ఇబ్బంది కలుగుతుందో అర్ధం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మతవిశ్వాసాలను కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పారు. హిజాబ్‌ బ్యాన్‌పై అప్పీల్‌కు సుప్రీం కోర్టుకు వెళ్లాలని పిటిషనర్లకు పిలుపునిచ్చారు.