పుతిన్ ఆస్తులు సీజ్‌.. అమెరికా సంచ‌ల‌న నిర్ణ‌యం

ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రష్యా ప్రభుత్వంపై కఠిన ఆంక్షలు విధిస్తూ వచ్చిన అగ్రరాజ్యం.. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడు పుతిన్‌, విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌పై వ్యక్తిగత ఆంక్షల బాణాలను ఎక్కుపెట్టింది. ఉక్రెయిన్‌పై దాడికి వీరివురే బాధ్యులని ఆరోపించింది.

ఈ విషయంలో అమెరికా.. ఐరోపా సమాఖ్యను అనుసరించింది. పుతిన్‌తో పాటు లావ్రోవ్‌ల ఆస్తులను స్తంభింపజేసేందుకు ఈయూ  నిర్ణయించింది. ఈ రెండో విడత ఆంక్షలకు 27 దేశాల ఈయూ విదేశాంగ మంత్రుల సమావేశం ఆమోదం తెలిపింది. ఇలా అగ్రరాజ్యం ఓ దేశాధినేతపై నేరుగా ఆంక్షలు విధించడం చాలా అరుదు. గతంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, బెలారస్ అధ్యక్షుడు లుకషెంకా, సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌పై ఈ తరహా ఆంక్షలు అమలు చేసింది.

రష్యా రక్షణ మంత్రి సెర్టీ షోయిగు, రష్యా చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ వాలెరీ గెరసిమోవ్‌పై కూడా అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపించింది. ఇప్పటికే రష్యన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 11 మంది ఉన్నతాధికారులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిసినప్పటికీ.. పుతిన్ ఆక్రమణ దిశగా అడుగులు వేశారని అమెరికా భావిస్తున్నట్లు తెలిసింది. ఇది పూర్తిగా పుతిన్ నిర్ణయమేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యావత్తు ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చి రష్యా చర్యలను వ్యతిరేకించాల్సిన బాధ్యత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై ఉంది.

అమెరికా సహా ఇతర దేశాలు విధిస్తున్న కఠిన ఆంక్షలతో రష్యా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవ‌కాశం క‌నిపిస్తోంది.  అలాగే, అంతర్జాతీయ సమాజంలో దౌత్యపరంగా, ఆర్థికంగా ఒంటరి అవుతుందని తెలుస్తోంది.  పుతిన్‌పై నేరుగా ఆంక్షలు విధించడంతో రష్యా దురాక్రమణను నిలువరించడంతో పాటు, ఐరోపాలో పెద్దయుద్ధం జరగకుండా ఆపే దిశగా ముందుకెళుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తిన్నా.. ఇది సాధ్య‌మేనా అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. ప్ర‌స్తుతం అమెరికా తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింద‌న‌డంలో సందేహం లేదు.