నో డౌట్.. ఐపీఎల్‌కు లైన్ క్లియర్

IPL

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ యధావిధిగా జరుగుతుందా? ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఉంటుందా లేదా? అనే సందేహాలతో వెర్రెత్తి పోతున్నారు క్రికెట్ లవర్స్. ఒకసారేమో ఈ ఏడాది చివరి క్వార్టర్లో ఐపీఎల్ జరుగుతుందని.. టీ20 ప్రపంచకప్ వాయిదా పడుతుందని వార్తలొస్తాయి. ఇంకోసారేమో టీ20 ప్రపంచకప్ పక్కాగా జరుగుతుందని.. ఐపీఎల్ పరిస్థితే అర్థం కాకుండా ఉందని అంటారు.

ఇలా రకరకాల ఊహాగానాలతో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు క్రికెట్ అభిమానులు. ఐతే ఎట్టకేలకు ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చినట్లే కనిపిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా ప్రధానమంత్రి తమ దేశంలో ఏ స్టేడియంలో అయినా ఫుల్ కెపాసిటీలో నాలుగో వంతు మంది అభిమానులను అనుమతిస్తూ మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ జరుగుతుందేమో అన్న అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డే.. పొట్టి కప్పు నిర్వహణ దాదాపు అసాధ్యం అని తేల్చేసింది. తమ దేశంలో స్టేడియాలకు నాలుగో వంతు అభిమానులను అనుమతించి ఉండొచ్చని.. అంత మాత్రాన టీ20 ప్రపంచకప్ జరుగుతుందని చెప్పలేమని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ప్రకటించారు. ఈ మెగా టోర్నీలో 16 జట్లు పాల్గొనాల్సి ఉందని.. ఆ పదహారు దేశాల్లో కరోనా వల్ల రకరకాల పరిస్థితులు నెలకొన్నాయని.. కొన్ని చోట్ల వైరస్ తీవ్ర స్థాయిలో ఉందని.. అలాంటపుడు అక్టోబరు సమయానికి అందరూ కరోనా ఫ్రీ అయిపోతారని అనుకోవడానికి లేదని.. ఆయా దేశాల్లో కరోనా విజృంభిస్తుండగా.. వాళ్ల జట్లను టోర్నీకి ఎలా అనుమతిస్తామని ఆయన ప్రకటించారు.

కాబట్టి టీ20 ప్రపంచకప్ జరగడం దాదాపు అసాధ్యం అన్న అభిప్రాయాన్ని ఆ టోర్నీని నిర్వహించాల్సిన బోర్డే వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ టోర్నీ ఈ ఏడాది జరగకపోవచ్చు. కాబట్టి ఆ స్థానంలో ఐపీఎల్ జరిపించుకోవడానికి బీసీసీఐ సన్నాహాలు చేసుకోవచ్చు. ఇండియాలో కుదరకపోతే యూఏఈలో టోర్నీ నిర్వహించే అవకాశముంది.