హిజాబ్ కన్నా చదువే ముఖ్యం

హిజాబ్ కన్నా ముస్లింలకు చదువులే ముఖ్యమని ముస్లిం రాష్ట్రీయ మంచ్ (ఎంఆర్ఎం) చెప్పింది. విద్యాసంస్దల్లో హిజాబ్ ధరించామా లేదా అన్న విషయం కన్నా చక్కగా చదువుకునే విషయంపైనే ముస్లిం అమ్మాయిలు దృష్టి పెట్టాలని ఎంఆర్ఎం కీలక నేతలు హితవుచెప్పారు. పిల్లల భవిష్యత్తుకు హిజాబ్ కన్నా చదువే ఉపయోగపడుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని జాతీయ కన్వీనర్ అధికార ప్రతినిధి షాహిద్ సయూద్ తెలిపారు.

కర్నాటకలోని ఉడిపి ప్రభుత్వ కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకి ఎంతగా వివాదాస్పదమవుతోందో అందరు చూస్తున్నదే. దాదాపు పది రాష్ట్రాల్లోని వందలాది విద్యాసంస్ధల్లో హిజాబ్ వివాదం అట్టుడికిపోతోంది. ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆర్ఎస్ఎస్  అనుబంధ సంస్ధన్న విషయం అందరికీ తెలిసిందే. హిజాబ్ విషయంలో ముస్లింలు ఛాందస భావాలనుండి బయటపడి అభ్యుదయ పథంలో ఆలోచించాలన్నారు.

భారత ముస్లింల్లో గ్రాడ్యుయేట్లు కేవలం 2.3 శాతం మాత్రమే ఎందుకున్నారనే విషయాన్ని అందరు ఆలోచించాలన్నారు. 43 శాతం అక్షరాస్యతున్న భారత ముస్లింల్లో నిరుద్యోగం కూడా విపరీతంగా పెరిగిపోతోందన్న విషయాన్ని అందరు గ్రహించాలన్నారు. దేశంలోని విద్యాసంస్ధల్లోని డ్రాపవుట్లలో అత్యధికం ముస్లింలే ఉన్నట్లు సయూద్ చెప్పారు.  20 కోట్ల ముస్లింల జనాభాలో విద్యావంతుల సంఖ్య ఎందుకింత తక్కువగా ఉందో ముస్లిం పెద్దలు ఆలోచించాలని సయూద్ పిలుపిచ్చారు.

నరేంద్రమోడి సర్కార్ రద్దుచేసిన త్రిబుల్ తలాక్ కారణంగానే ఎంతోమంది ముస్లిం మహిళలకు ఊరటనిచ్చిన విషయం అందరు గ్రహించాలన్నారు. హిజాబ్ వివాదంతో కాలాన్ని  వృధా చేసుకునే కన్నా అందరు చదువుపైనే ఎక్కువ దృష్టిపెడితే అందరికీ మంచిదని హితవు పలికారు. హిజాబ్ ధరించటం, ధరించకపోవటం వల్ల ముస్లిం యువతుల భవిష్యత్తు ఏ విధంగా మారదని,  మంచి భవిష్యత్తు కేవలం చదువుకుంటే మాత్రమే వస్తుందని సయీద్ తెలిపారు. మరి ముస్లిం రాష్ట్రీయ మంచ్ హితవు తర్వాతైనా ముస్లిం సమాజంలో మార్పొ వస్తుందేమో చూడాలి.