కోహ్లి స్థానంలో ఎవరు?

టెస్టు కెప్టెన్సీనుంచి తప్పుకోవడం ద్వారా విరాట్ కోహ్లి పెద్ద షాకే ఇచ్చాడు ఇడియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి. నాలుగైదేళ్లుగా మూడు ఫార్మాట్లలో అతను భారత జట్టును విజయవంతంగా నడిపించాడు. ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న మాటే కానీ.. కెప్టెన్సీ సక్సెస్ రేట్ అన్ని ఫార్మాట్లలో చాలా బాగుంది. ముఖ్యంగా టెస్టుల్లో అతడి రికార్డు అద్భుతం. ఏ భారత కెప్టెన్‌కూ  సాధ్యం కానన్ని విజయాలందించాడు జట్టుకి. అతను జట్టు పగ్గాలందుకునే సమయానికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం 7.

ఇప్పుడు మనది నంబర్ వన్ జట్టు. ముఖ్యంగా భారత పేస్ బౌలింగ్ తిరుగులేని స్థాయికి చేరుకోవడంలో కోహ్లిది కీలక పాత్ర. తాజాగా దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలవకపోయినా భారత జట్టు మంచి ప్రదర్శనే చేసింది. ఇంత బాగా జట్టును నడిపిస్తున్న కోహ్లి.. ఇలా నిష్క్రమించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు తానుగా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే.. సరైన కమ్యూనికేషన్ లేకుండా తనను వన్డే సారథ్యం నుంచి తప్పించడం పట్ల కోహ్లి హర్టయినట్లే ఉన్నాడు. నిజానికి వన్డేలు, టీ20లకు వేర్వేరుగా కెప్టెన్లను పెట్టడం సరైన నిర్ణయం కాదు.

పైగా లిమిటెడ్ ఓవర్స్‌లో కోహ్లి కంటే రోహిత్ మెరుగైన కెప్టెన్ అన్న అభిప్రాయం అందరిలో ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వన్డే కెప్టెన్‌గా కోహ్లి మీద వేటు వేసినట్లున్నారు. ఇక్కడ కోహ్లి ఇగోకు పోకుండా టెస్టుల్లో సారథిగా కొనసాగాల్సింది. మొత్తానికి కోహ్లి తప్పుకున్నాడు కాబట్టి అనివార్యంగా ఇప్పుడు టెస్టులకు కూడా కొత్త సారథిని చూడాల్సిందే. మరి ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది ఆసక్తికరం.

ఫస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నది రోహిత్ శర్మనే. కానీ టెస్టుల్లో రోహిత్ ఎప్పుడూ మేటి ఆటగాడిగా గుర్తు చేసుకున్నది లేదు. రెండేళ్ల ముందు వరకు టెస్టు జట్టులో అతడికి చోటే లేదు. పునరాగమనంలో సత్తా చాటినప్పటికీ.. అది ఫ్లాట్ పిచ్‌ల మీదే. కఠినమైన విదేశీ పిచ్‌ల మీదే తనేంటో రుజువు చేసుకోవాలి. జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేదు. ఇలాంటి ఆటగాడికి ఎలా పగ్గాలు అప్పగించాలన్న ప్రశ్న తలెత్తుతోంది. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ అంటే అతడికి భారంగా కూడా మారొచ్చు. 

పైగా భవిష్యత్ దృష్ట్యా యువ ఆటగాళ్లను కెప్టెన్సీకి పరిగణిస్తే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన రహానెకి ఇప్పుడు జట్టులోనే స్థానం ప్రశ్నార్థకంగా మారింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో సారథిగా తేలిపోయిన రాహుల్‌ను నమ్మి పగ్గాలు అప్పగించడం కష్టమే. ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి యువ ఆటగాళ్ల వైపు చూడటం బెటర్ అనిపిస్తోంది. కానీ కాస్త బాద్యతారాహిత్యంగా ఆడే పంత్‌ ఈ బాధ్యతలకు సరిపోతాడా.. ఇంకా జట్టులో కుదురుకోని శ్రేయస్ అయ్యర్‌ను అప్పుడే కెప్టెన్‌ను చేయడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతాయి. మరి సెలక్టర్లు, బీసీసీఐ ఆలోచనలు ఎలా ఉన్నాయో మరి.