పౌరసత్వాన్ని వదులుకుంటున్న సంపన్నులు

దేశం నుండి విదేశాలకు వెళ్ళిపోతున్న సంపన్నుల సంఖ్య పెరిగిపోతోంది. సంపన్న కుటుంబాల్లో యజమానులు మాత్రమే విదేశాలకు వెళ్ళటంకాదు. తమ  కుటుంబాలతో సహా వలసలు వెళ్ళిపోతున్నారు. విదేశాలకు వలసలు వెళ్ళిపోతున్న సంపన్నులు ఆశ్చర్యంగా భారత పౌరసత్వాన్ని కూడా వదిలేసుకుంటున్నారు. ద్వంద్వ పౌరసత్వాలను అనుమతించని దేశాల్లో ఉంటున్న సంపన్నులు మన దేశ పౌరసత్వాన్ని సైతం వదులుకోవటానికి ఏ మాత్రం వెనకాడటం లేదు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గడచిన ఐదేళ్ళల్లో 6 లక్షల మంది సంపన్నులు వలసలు వెళ్ళిపోయారు. ఇలా పౌరసత్వాలు వదులుకున్న వారిలో 40 శాతం మంది అమెరికాలో స్ధిరపడ్డారట. ఆ తర్వాత ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో పౌరసత్వం తీసుకున్నారు.  ఇలాంటి సంపన్నులంతా విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టుబడులు పెట్టడం ద్వారా వీళ్ళల్లో చాలామంది పౌరసత్వాన్ని కొనేసుకుంటున్నారు.

కరేబియన్ దీవులు, బహామా ఐల్యాండ్స్, బ్రిటీష్ వర్జీనియా లాంటి అనేక దేశాలు పెట్టుబడుల కోసం ఇలాంటి సంపన్నులను ఆహ్వానిస్తున్నాయి. అనేకరకాలుగా వీళ్ళ పెట్టుబడులకు పన్నులు మినహాయింపులు ఇవ్వటం, హై ప్రొఫైల్ సిటిజన్స్ గా ట్రీట్ చేస్తున్న కారణంగా మనదేశంలోని సంపన్నులు పై దేశాలు అత్యంత విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. బ్యాంకుల నుండి అప్పుల రైపంలో వేలాది కోట్ల రూపాయాల ప్రజాధనాన్ని దోచేసుకుంటున్న కొందరు ఆర్ధిక నేరగాళ్ళు కూడా పైన చెప్పిన దేశాల్లో హ్యాపీగా స్ధిరపడిపోతున్నారు.

విదేశాల్లో స్ధిరపడిన మన సంపన్నులు మన పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. కాబట్టి మన పాస్ పోర్టు కూడా రద్దయిపోతుంది. 2017 నుండి ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోతోంది. 2019లో అత్యధికంగా 1.5 లక్షల మంది తమకు భారత్ పౌరసత్వం వద్దని దరఖాస్తులు చేసుకున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా 2020లో ఈ సంఖ్య 85 వేలకు తగ్గింది. అయితే ఈ సంవత్సరం మళ్ళీ ఈ సంఖ్య దాటిపోయింది. కారణాలు ఏవైనాకానీండి మనదేశంలో సంపన్నులు ఇక్కడ ఉండాలని మాత్రం అనుకోవటంలేదన్నది వాస్తవం.