హైద‌రాబాద్ లెక్క మారింది.. మంచిదేనా?

హైద‌రాబాద్ లెక్క‌మారింది. దేశంలో ఎక్క‌డ ఎలాంటి ప‌రిస్థితి ఉన్నా.. హైద‌రాబాద్‌లో మాత్రం.. భిన్నంగా ఉంద‌ని మేధావులు చెబుతున్నారు. ఇది న‌గ‌రానికి మంచి ప‌రిణామంక‌న్నా.. ప్ర‌మాదమే ఎక్కువ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి దీనికి కార‌ణ‌మేంటి? ఇదీ.. రీజ‌న్‌.. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. ప్రజల కొనుగోళ్ల శక్తి కూడా మునుపటితో పోలిస్తే పెరిగింది. ముఖ్యంగా సొంత ఇంటికి ఆదరణ పెరగడం, తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తుండడం వంటి తదితర పరిణామాలతో గృహ విక్రయాలు పెరిగాయి. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా ఇళ్ల ధరలు సైతం పెరుగుతున్నాయి.

ఈ విషయంలో హైదరాబాద్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇళ్ల ధరల పెరుగుదల విషయంలో దేశంలోని 8 ప్రధాన నగరాలతో పోల్చినప్పుడు భాగ్యనగరం మొదటి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయం గా 128వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఈ మేరకు మూడో త్రైమాసికానికి సంబంధించి విడుదల చేసిన ‘గ్లోబల్‌ రెసిడెన్షియల్‌ సిటీస్‌ ఇండెక్స్‌’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గతేడాదితో పోల్చినప్పుడు హైదరాబాద్‌లో 2.5 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగినట్లు నివేదిక పేర్కొంది.

ఈ విషయంలో 2.2 శాతం వృద్ధితో చెన్నై రెండో స్థానం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 131వ స్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలైన కోల్‌కతా 1.5 శాతం (135), అహ్మదాబాద్‌ 0.4 శాతం (139) వృద్ధితో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబయి ఈ విషయంలో – 1.8 శాతం క్షీణత నమోదు చేసింది. అంతర్జాతీయంగా 146వ స్థానంలో నిలిచింది. బెంగళూరు (0.2 శాతం), దిల్లీ (0.7 శాతం), పుణె (1.5 శాతం) మేర క్షీణత నమోదు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లోని పెరిగిన ఇళ్ల ధరలను ఆధారంగా చేసుకుని నైట్‌ ఫ్రాంక్‌ 2021 ఈ నివేదికను రూపొందించింది.

క్యూ3లో గతేడాదితో పోల్చినప్పుడు సగటున 10.6 శాతం మేర వృద్ధి కనిపించినట్లు నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. 93 శాతం నగరాలు వృద్ధిని కనబరచగా.. 44 శాతం నగరాలు రెండంకెల వృద్ధిని వృద్ధి సాధించినట్లు నివేదిక పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలు, తక్కువ వడ్డీ రేట్లు వంటివి దేశంలో గృహ విక్రయాలు పెరగడంలో కీలక పాత్ర పోషించినట్లు నైట్‌ఫ్రాంక్ పేర్కొంది. గత ఆరు త్రైమాసికాల నుంచి ఇదే ఒరవడి కొనసాగుతోందని, ఇదే తరహా ట్రెండ్‌ మరికొంతకాలం పాటు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు టర్కీకి చెందిన ఇజ్మీర్‌ (34.8 శాతం) అగ్రస్థానంలో8 నిలవగా.. న్యూజిలాండ్‌కు చెందిన వెల్లింగ్టన్‌ (33.5 శాతం) రెండో స్థానం సాధించింది.

అయితే.. హైద‌రాబాద్‌లో ఇళ్ల ధ‌ర‌లు పెరిగిపోవ‌డం వ‌ల్ల‌.. మ‌ధ్య త‌ర‌గ‌తివ‌ర్గం ఈ న‌గ‌రానికి దూర‌మ‌య్య ప్ర‌మాదం కూడా ఉంద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో.. న‌గ‌ర ప‌రిధి పెరిగి.. ప్ర‌భుత్వానికి ఆదాయం మాట  అటుంచితే.. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు భారీ ఎత్తున వెచ్చించాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు. ఒక‌వైపు ధ‌ర‌లు పెరిగి.. దేశంలోనే ప్ర‌థ‌మ స్థానం సంపాయించుకున్నా.. ఇత‌ర‌త్రా కార‌ణాలు.. మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గం మూడ్ వంటివాటిని చూస్తే.. మాత్రం ఇది వ్య‌తిరేక ఫ‌లితం ఇచ్చే ప్ర‌మాదం ఉంద‌ని ఖ‌చ్చితంగా చెబుతున్నారు.