టీమిండియాపై ‘తోక’ జాడించిన కివీస్

చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన కాన్పూర్ టెస్టు డ్రాగా ముగిసింది. ఆఖరి బంతి వరకు భారత్ ను విజయం ఊరిస్తూనే వచ్చి ఉసూరుమనిపించింది. అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రాచిన్ రవీంద్ర అద్భుతంగా పోరాడి తమ జట్టును డ్రాతో గట్టెక్కించాడు. రాచిన్ రవీంద్ర భారత స్పిన్నర్ల సహనాన్ని పరీక్షిస్తూ భారత విజయానికి అడ్డుగోడగా నిలిచాడు. దాదాపు 16 ఓవర్లపాటు క్రీజులో ఉన్న రవీంద్ర 91 బంతులను ఎదుర్కొని నాటౌట్ గా నిలిచి తన జట్టును పరాభవం నుంచి తప్పించాడు.

మొదటి టెస్టు చివరిరోజు ఆటలో 284 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్ టామ్ లాథమ్ (52) మంచి ఆరంభాన్నిచ్చాడు. అయితే, అతడికి మరో ఎండ్ లో సహకారం దొరక్కపోవడంతో కివీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. కెప్టెన్ విలియమ్సన్ (24) మినహా మిగతావారు అంతగా రాణించలేదు. దీంతో, 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన పర్యాటక జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో, భారత్ గెలుపు లాంఛనమే అని అంతా అనుకున్నారు.

అయితే, ఈ దశలో భారత స్పిన్నర్లను టెయిలెండర్ అజాజ్ పటేల్ తో కలిసి రవీంద్ర దీటుగా ఎదుర్కొన్నాడు. ఐదో రోజు స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై అద్భుతమైన డిఫెన్స్ తో అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ వంటి మేటి స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. చివరి నాలుగు ఓవర్లలో వెలుతురు లేమితో మ్యాచ్ కు అంతరాయం కలుగుతుందేమోనని టీమిండియా ఆటగాళ్లు కంగారుపడ్డారు. చివర్లో అంపైర్లు ప్రతి ఓవర్ కు లైట్ మీటర్ తో వెలుతురును చెక్ చేశారు. అయితే, వెలుతురు సరిపోవడంతో ఆటను కొనసాగించినా…చివరి వికెట్ ను తీయడంలో బౌలర్లు విఫలమయ్యారు. చివరకు, వెలుతురు మందగించడంతో మరో రెండు ఓవర్లు ఉండగానే ఆటను ముగించడంతో మ్యాచ్ డ్రా అయ్యింది.

రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ ని కుప్పకూల్చారు. అక్సర్ పటేల్, ఉమేష్ యాదవ్ తల ఒక వికెట్ తో బౌలింగ్ లో ఫర్వాలేదనిపించారు. అరంగేట్ర టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక, ఇరు జట్ల మధ్య రెండో టెస్టు డిసెంబరు 3నుంచి ముంబైలో జరగనుంది.