పెట్స్ కోసం స్పెషల్ ఫ్లైట్.. టికెట్ రేటు తెలిస్తే అవాక్కే..

రోజులు మారాయి. కలలో కూడా ఊహించని రోజులు వచ్చేశాయి. మనిషి మనిషి చూసుకోని.. కలుసుకోని రోజులే కాదు.. కలిసినా గతంలో మాదిరి చనువుగా ఉండలేని పరిస్థితి. కాలంతో పాటు పరుగులు పెట్టే మనిషి జీవితం సడన్ బ్రేక్ వేసినట్లుగా ఆగింది. లాక్ డౌన్ పుణ్యమా అని ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రెండున్నర నెలల తర్వాత ఇప్పుడిప్పుడే ప్రయాణాలు షురూ అయ్యాయి. అయితే.. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. ఏ మూల నుంచి కరోనా అంటుకుంటుందన్న భయాందోళనల మధ్య ప్రయాణాలు చేస్తున్నారు.

రోజుల తరబడి తమకు సంబంధం లేని ప్రాంతాల్లో ఉన్నోళ్లు ఎందరో. అలాంటివారంతా ఇప్పుడు వడివడిగా ప్రయాణాలు చేస్తూ తమ ఇళ్లకు వెళుతున్నారు. మనుషుల సంగతి సరే. కొందరు తాము అమితంగా ప్రేమించే పెంపుడు జంతువుల సంగతి ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా ఢిల్లీ నుంచి ముంబయికి త్వరలోనే ఒక ప్రైవేటు చార్టర్డ్ జెట్ ను అందుబాటులోకి తేనున్నారు.

డబ్బున్న మారాజులు తాము అమితంగా ప్రేమించే పెంపుడు జంతువులకు దూరంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే.. ఒక దేశ రాజధాని నుంచి వాణిజ్య రాజధానికి స్పెషల్ జెట్ నడపనున్నారు. దీంతో దూరంగా ఉన్నోళ్లు దగ్గర కానున్నారు. గతంలో మాదిరి పెంపుడు జంతువుల్ని విమానాల్లో ప్రయాణించటానికి అనుమతించటం లేదు. దీంతో.. జంతువులు.. పక్షుల కోసం ప్రత్యేక ఫ్లైట్లో తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రయాగాత్మకంగా ఆరుసీట్లు ఉన్న ఒకప్రైవేటు జెట్ ను తాజాగా అద్దెకు తీసుకున్నారు. ఢిల్లీ నుంచి ఆరు జంతువులు.. పక్షుల్ని ముంబయికి తీసుకెళ్లటానికి రూ.9.06 లక్షలు అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే.. ఒక్కో దానికి లక్షన్నర కంటే ఎక్కువ ఖర్చు అన్న మాట.

ఇంత ఖరీదుకు వెనుకాడకుండా రెండు పిష్ జూస్.. ఒక గోల్డెన్ రిట్రీవర్.. ఒక ఆడ నెమలి లాంటి పక్షుల్ని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోరెండు సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెబుతున్నారు. వారం వ్యవధిలో ఈ స్పెషల్ చాపర్ బయలుదేరనుంది. ఒకవేళ.. రెండు ఖాళీ సీట్లు నిండని పక్షంలో టికెట్ ధర మరింత పెరగనుంది. ముచ్చటగా పెంచుకునే పెంపుడు జంతువుల కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడని వారికి అదనపు భారాన్ని సంతోషంగా ఓకే చేయటం ఖాయమని చెప్పక తప్పదు.