పాక్ ఓడింది.. పాపం అత‌ను బ‌లి


టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్ 12 ద‌శ‌లో అదిరిపోయే ప్ర‌ద‌ర్శ‌న చేసింది పాకిస్థాన్ జ‌ట్టు. పెద్ద‌గా అంచ‌నాల్లేకుండా టోర్నీలో అడుగు పెట్టిన ఆ జ‌ట్టు.. తొలి మ్యాచ్‌లో ఇండియాను, ఆ త‌ర్వాత న్యూజిలాండ్‌ను ఓడించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. త‌ర్వాత మిగ‌తా మూడు చిన్న జ‌ట్ల‌నూ ఓడించి అజేయంగా సెమీస్ చేరింది. దీంతో ఇక క‌ప్పు మ‌న‌దే అన్న ధీమాలోకి వ‌చ్చేశారు ఆ దేశ అభిమానులు. ఆస్ట్రేలియాతో సెమీఫైన‌ల్లో కూడా చాలా వ‌ర‌కు పాకిస్థాన్ ఆధిప‌త్య‌మే సాగింది. కానీ ఆఖ‌ర్లో మ్యాచ్ అనూహ్య మ‌లుపులు తిరిగి ఆస్ట్రేలియాను విజ‌యం వ‌రించింది. ఐతే ఈ ఓట‌మికి ఓ ఆట‌గాడిని బ‌లి చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది పాకిస్థాన్ క్రికెట్లో. అత‌నే.. హ‌స‌న్ అలీ. ఇప్పుడు పాకిస్థాన్ అభిమానుల చేతికి ఇత‌ను చిక్కితే అంతే సంగ‌తులు.

నిజానికి మూడు బంతుల్లో మూడు సిక్స‌ర్లు ఇచ్చిన ష‌హీన్ అఫ్రిదినే హ‌స‌న్‌తో పోలిస్తే ఓట‌మికి ఎక్కువ బాధ్య‌త తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వేడ్ మూడు సిక్స‌ర్లు కొట్ట‌డానికి ముందు మిడాన్‌లో క్యాచ్ లేప‌గా.. ప‌క్క‌కు ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చిన హ‌స‌న్ అలీ ఆ క్యాచ్ అందుకోలేక‌పోయాడు. పాకిస్థాన్ జ‌ట్టులో హ‌స‌న్ లాగే చాలామంది ఫీల్డింగ్‌లో వీక్. ఆ క్యాచ్ అంత తేలికని చెప్ప‌లేం. అలా అని మ‌రీ క‌ష్టం కాదు. కానీ ఇలా క్యాచ్‌లు నేల‌పాలు కావ‌డం మామూలే. ఆ త‌ర్వాత కూడా 9 బంతుల్లో 18 ప‌రుగుల‌తో స‌మీక‌ర‌ణం క‌ష్టంగానే ఉంది. షహీన్ బాగా బౌలింగ్ చేసి ఉంటే పాక్ గెలిచేది. కానీ వేడ్ వ‌రుస‌గా మూడు సిక్స‌ర్లు బాది ఒక ఓవ‌ర్ మిగిలుండ‌గానే ఆసీస్‌ను గెలిపించాడు.

ఐతే హ‌స‌న్ క్యాచ్ వ‌దిలేయ‌డం వ‌ల్లే పాక్ ఓడిందంటూ ఆ దేశ అభిమానులు అత‌డిపై ప‌డిపోతున్నారు. ఇందుకు వేరే కార‌ణం లేక‌పోలేదు. పాకిస్థాన్‌లో మైనారిటీ అయిన షియా ముస్లిం వ‌ర్గానికి చెందిన వాడు హ‌స‌న్. పైగా అత‌ను ల‌క్నోకు చెందిన భార‌త అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీని వ‌ల్ల త‌ర‌చుగా హ‌స‌న్ టార్గెట్ అవుతుంటాడు. ఇప్పుడీ క్యాచ్ వ‌దిలేయ‌డంతో అత‌డిని పాక్ అభిమానులు ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. అత‌ణ్ని, త‌న కుటుంబ స‌భ్యుల‌ను చంపేస్తామ‌ని బెదిరింపుల‌కు కూడా పాల్ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త నెటిజ‌న్లు ఐస్టాండ్ విత్ హ‌స‌న్ అలీ అని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.