క్రికెట్ లోకి యువరాజ్ సింగ్ రీ ఎంట్రీ?

Yuvraj Singh

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు 2019లో రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ అనంతరం తాను నెలకొల్పిన క్రికెట్ అకాడమీ బాధ్యతలు చూసుకుంటున్న యువీ పేరు క్రీడలపరంగా ఈ మధ్యకాలంలో పెద్దగా వార్తల్లో వినబడలేదు. ఈ క్రమంలోనే తాజాగా యువీ తన ఇన్ స్టా ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. అభిమానుల కోరిక ప్రకారం మరో నాలుగు నెలల్లో తాను మైదానంలో అడుగుపెట్టబోతున్నానని యువీ చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది.

భగవంతుడు మన గమ్యాన్ని నిర్దేశిస్తాడన్న యువీ… అభిమానుల కోరిక ప్రకారం తాను వచ్చే ఫిబ్రవరిలో మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉందని పోస్ట్ చేశాడు. టీమిండియాకు అభిమానుల మద్దతు ఇలాగే కొనసాగాలని, నిజమైన అభిమాని.. కఠిన సమయాల్లో కూడా జట్టుకు మద్దతుగా నిలుస్తాడని యువీ అన్నాడు. 2017లో ఇంగ్లండ్ పై సాధించిన సెంచరీ వీడియోను పోస్ట్ కు యాడ్ చేశాడు.

ఈ క్రమంలోనే యువీ పెట్టిన పోస్ట్ పై నెటిజన్లు, యువీ అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. యువీ రాక కోసం ఎదురుచూస్తున్నామని, మళ్లీ ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొడితే చూడాలని ఉందని ఓ అభిమాని కామెంట్ చేశాడు. అయితే, ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో భారత్ వరుస ఓటముల నేపథ్యంలో అభిమానులు ఆగ్రహంతో ఉన్నారని, ఈ సమయంలో జట్టుకు అండగా నిలవాలన్న పిలుపునివ్వడమే యువీ పోస్ట్ ఉద్దేశ్యమని మరి కొందరంటున్నారు.

ఇక, అసలు విషయం అది కాదని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ జరుగాల్సి ఉందని, ఆ సిరీస్ లో యువీ కూడా పాల్గొనబోతున్నాడని కొందరు అంటున్నారు. ఆ టోర్నీలో ఆడేందుకు మైదానంలోకి అడుగుపెట్టబోతున్నానని చెప్పాడని, కాకపోతే కొంత ట్విస్ట్ చేసి ప్రాంక్ లా చెప్పాడని కొందరు అంటున్నారు. అయితే, యువీ.. రోడ్ సేఫ్టీ సిరీస్ కోసమే ఈ పోస్టు పెట్టాడా..? లేక నిజంగానే రీ ఎంట్రీ ఇస్తాడా..? అన్నది తేలాలంటే మాత్రం ఫిబ్రవరి దాకా వేచి చూడక తప్పదు.