పొగిడినా ఐపీఎలే.. తిట్టినా ఐపీఎలే

కొన్ని నెలల కిందట విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ కోసం పర్యటిస్తుంటే.. ఇంకోవైపు శిఖర్ ధావన్ నాయకత్వంలో ఇంకో 20 మందితో కూడిన మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇలా రెండు దేశాలకు రెండు జట్లను పంపేంత లగ్జరీ ప్రపంచ క్రికెట్లో ఇండియాకు మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు.

అంతమంది ప్రతిభావంతులు భారత క్రికెట్లో ఉన్నారు. అవసరమైతే ఇంకో జట్టును కూడా సిద్ధం చేసి అంతర్జాతీయ క్రికెట్ ఆడించగల సత్తా భారత్‌కు ఉందన్నది స్పష్టం. ఈ స్థాయిలో యువ ప్రతిభావంతులు వెలుగులోకి రావడానికి ముఖ్య కారణం ఐపీఎల్ అనడంలో సందేహం లేదు.

దేశంలో యువ క్రికెటర్లు ప్రతిభ చాటుకోవడానికి ఇంతకంటే వేదిక మరొకటి లేదు. కేవలం ఒక్క మ్యాచ్‌తో హీరోలైపోయి అందరి నోళ్లలో నాని.. కొంత కాలానికే భారత జట్టు తలుపు తట్టే స్థాయికి కుర్రాళ్లు వస్తున్నారంటే అందుక్కారణం ఐపీఎలే.

జస్‌ప్రీత్ బుమ్రా సహా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చింది ఐపీఎల్‌తోనే. భారత క్రికెట్‌కు ఐపీఎల్ చేసిన మేలు అంతా ఇంతా కాదని అంతర్జాతీయ స్థాయిలో ఎందరో దిగ్గజ ఆటగాళ్లు, మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు కొనియాడిన వాళ్లే. ఈ విషయంలో ఇండియాను చూసి అసూయ కూడా చెందుతుంటారు. ఐతే ఇంతలా పొగిడిన ఐపీఎల్‌ను ఇప్పుడు అందరూ తెగ తిట్టేస్తున్నారు. ఐపీఎల్ ప్రదర్శన చూసి ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేయడం తప్పని.. మనోళ్లందరూ ఐపీఎల్ మత్తులో ఉండి అదే మాదిరి గుడ్డి షాట్లు ఆడేస్తున్నారని.. ఈ కుర్రాళ్లు ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీల కోసం, డబ్బు కోసం అయితే ప్రాణం పెట్టి ఆడేస్తారని.. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

నిన్న న్యూజిలాండ్ చేతిలో మ్యాచ్ ఓడినప్పటి నుంచి ‘బ్యాన్ ఐపీఎల్’ అనే హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుండటం.. నెటిజన్లు లీగ్ మీద విరుచుకుపడిపోతుండటం గమనార్హం. ఐతే ఇలా తిట్టేవాళ్లందరూ ఐపీఎల్ వచ్చిందంటే ఎక్కడ లేని ఉత్సాహంతో టీవీల ముందు కూలబడిపోతారన్న మాట వాస్తవం.