ఫేస్ బుక్ పై రూ.515 కోట్ల భారీ ఫైన్.. ఏమిటంత పెద్ద తప్పు?

సామాజిక మాధ్యమాల్లో తిరుగులేనిది ఉన్న ఫేస్ బుక్ కు భారీ షాకిచ్చింది బ్రిటన్. తాజాగా ఎఫ్ బీకి రూ.515 కోట్ల భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకూ అంత భారీ మొత్తంలో జరిమానా ఎందుకు వేశారు? దీనికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బ్రిటన్ కాంపిటీషన్ రెగ్యులేటరీ ఈ భారీ ఫైన్ ను వేసింది. తాము అడిగిన వివరాల్ని ఇవ్వటంలో ప్రదర్శించిన నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా ఈ భారీ మొత్తాన్ని చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కంపెనీ ఏదైనా కానీ చట్టాలకు లోబడి పని చేయాలని స్పష్టం చేసింది. అందుకు తప్పుగా వ్యవహరిస్తే ఇదే తరహాలో చర్యలు ఉంటాయని వెల్లడించింది. ఇంతకీ ఫేస్ బుక్ చేసిన తప్పేమిటంటే.. గత ఏడాది యానిమేటెడ్ కంపెనీ ‘‘జిఫీ’’ని కొనుగోలు చేసింది. దీంతో.. సోషల్ మీడియాలో పోటీని ఫేస్ బుక్ నియంత్రిస్తోందన్న ఆరోపణ బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ విచారణ చేపట్టింది.

తమకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలని పలుమార్లు కోరింది. అయితే.. ఫేస్ బుక్ మాత్రం ఆ వినతులను లైట్ తీసుకుంది. సమాచారాన్ని ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తున్న ఫేస్ బుక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భారీ జరిమానాను విధించారు. తాము అడిగిన వివరాల్ని ఇచ్చే విషయంలో ఫేస్ బుక్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ఉద్దేశపూర్వకంగానే వెనకడుగు వేసినట్లుగా పేర్కొంది.

భారీ జరిమానాను విధించిన నేపథ్యంలో ఫేస్ బుక్ స్పందించింది. తామీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. సీఎంఏ నిర్ణయాన్ని సమీక్షించి తదుపరి ఉన్న అవకాశాలు ఏమిటన్నది పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. వివరాలు అడిగిన వెంటనే తగిన సమాచారాన్ని ఇచ్చి ఉంటే సరిపోయేదానికి.. ఈ భారీ జరిమానా పడిన తర్వాత కానీ రియాక్టు కాకపోవటం చూస్తే.. ఫేస్ బుక్ కు ఆ మాత్రం శాస్తి జరగాలని ఫీలయ్యే వారు లేకపోలేదు. ఫేస్ బుక్ వాదనకు బ్రిటన్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.