కోహ్లి మరో షాక్.. ఆర్సీబీ కెప్టెన్సీకి టాటా

విరాట్ కోహ్లి నాలుగు రోజుల ముందే పెద్ద షాక్ ఇచ్చాడు. వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత తాను భారత టీ20 జట్టు పగ్గాలు వదిలేయబోతున్నట్లు ప్రకటించాడు. ఐసీసీ ట్రోఫీ సాధించలేదన్న మాటే కానీ.. ఏ ఫార్మాట్లో అయినా సరే కోహ్లి కెప్టెన్‌గా ఫెయిల్యూర్ అని చెప్పలేం. అతడి కెప్టెన్సీ రికార్డు చాలా బాగుంది కూడా. అతను ఉండాలనుకుంటే ఇంకా కొంత కాలం కెప్టెన్‌గా కొనసాగవచ్చు. కానీ ఈ మధ్య కొంచెం ఫాం తగ్గిన నేపథ్యంలో మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ భారం అనుకున్నాడో, ఇంకేవైనా ఒత్తిళ్లు పని చేశాయేమో కానీ.. భారత టీ20 పగ్గాలు వదిలేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇది విరాట్ అభిమానులకు అంతగా రుచించలేదు.

ఐతే ఈ నిర్ణయం ప్రకటించి వారం తిరక్కముందే కింగ్ ఇంకో అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు సారథ్యం నుంచి కూడా తాను తప్పుకోనున్నట్లు ప్రకటించాడు.

ఐపీఎల్ 14వ సీజన్ రెండో దశ ఆదివారమే ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ పూర్తవగానే కోహ్లి ఆర్సీబీ పగ్గాలు వదిలేయబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే ఒక వీడియో ద్వారా వెల్లడించాడు. ఫ్రాంఛైజీ ప్రతినిధులతో, జట్టు సభ్యులతో మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నానని.. కెప్టెన్‌గా ఇదే తన చివరి సీజన్ అని.. ఐతే ఆర్సీబీ సభ్యుడిగా మాత్రం కొనసాగుతానని.. తన చివరి ఐపీఎల్ మ్యా‌చ్ వరకు ఈ జట్టుతోనే కొనసాగుతానని కోహ్లి ఎమోషనల్‌గా అన్నాడు.

ఐపీఎల్‌లో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి ప్రదర్శన తిరుగులేదు. కానీ తొమ్మిది సీజన్ల నుంచి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతను ఇప్పటిదాకా ఆర్సీబీని ఒక్కసారి కూడా విజేతగా నిలపలేకపోయాడు. ఒక్కసారి మాత్రమే తన సారథ్యంలో ఆ జట్టు ఫైనల్ చేరింది. గత మూడు సీజన్లలో పేలవ ప్రదర్శన చేసిన ఆ జట్టు.. ఈ సారి బాగానే ఆడుతోంది. మరి కెప్టెన్‌గా చివరి సీజన్లో అయినా జట్టును కోహ్లి విజేతగా నిలబెడతాడేమో చూడాలి.