సహజీవనంపై మద్రాస్ హైకోర్టు సంచలనం.. ఏమన్నదంటే?

సంచలన వ్యాఖ్యల్ని చేసింది మద్రాస్ హైకోర్టు. ఇటీవల కాలంలో చిన్న కారణాలకే విడాకుల వరకు వచ్చే యువజంటలు.. పెళ్లికి ముందు సహజీవనం పేరుతో చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. కీలక వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఒక చట్టం అమల్లోకి వచ్చాక పవిత్రత అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్న గుస్సాను వ్యక్తం చేసింది. పెళ్లి అంటే సరైన కారణం లేకుండా.. ఎలాంటి జంకు.. గొంకు లేకుండా తెంచుకునే కాంట్రాక్టు కాదని ఇప్పటి తరం అర్థం చేసుకోవాలని కోరింది.


సహజీవన సంబంధాలను ఆమోదించే గృహ హింస నిరోధక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పవిత్రత అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. అసహనం.. అహంకారం అనేవి చెప్పులు లాంటివని భార్యభర్తలు అర్థం చేసుకోవాలని కోర్టు కోరింది. చెప్పుల్ని ఇంటి బయట వదిలిపెట్టినట్లే.. అహంకారం.. అసహనాల్ని కూడా వదిలిపెట్టాలని కోరింది. అలా జరగని పక్షంలో పిల్లలు బాధాకరమైన జీవితాల్ని జీవించాల్సి వస్తోందన్నారు. ఒక ప్రభుత్వ అధికారి మీద పెట్టిన కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యల్ని చేసింది.


పశుసంవర్థక శాఖలో వెటరినేరియన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగిపై ఆయన భార్య గృహ హింస కేసు పెట్టటంతో ఆయన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అయితే.. తన భార్య తనను వదిలిపెట్టినట్లుగా చెబుతూ.. ఆమె నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ అంతకు ముందు విడాకుల దరఖాస్తు దాఖలు చేశారు. ఆ దరఖాస్తును 2020 ఫిబ్రవరిలో ఫ్యామిలీ కోర్టు అనుమతించింది. న్యాయస్థానం నుంచి తీర్పు రావటానికి నాలుగు రోజులు ముందు ఆమె గృహ హింస కేసు పెట్టింది. దీంతో ఆ అధికారి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆమె కంప్లైంట్ ను పరిశీలిస్తే.. విడాకులు మంజూరు అవుతున్నాయన్న విషయాన్ని ఆమె ముందుగానే ఊహించినట్లు అర్థమవుతుందన్న న్యాయస్థానం.. ‘భార్యకు వ్యతిరేకంగా చరర్యలు తీసుకోవటానికి భర్తకు అవకాశం కల్పించే చట్టం లేదు. పిటిషనర్ కు అనవసరమైన ఇబ్బందులు కలిగించేందుకే ఫిర్యాదు చేశారు. ఆయనపై విధించిన సస్పెన్షన్ ను రద్దు చేసి.. పదిహేను రోజుల్లో తిరిగి విధుల్లో చేర్చుకోవాలి’’ అంటూ ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.