ఐదు జిల్లాలే ప్రమాధకరమా ?

రాష్ట్రంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పాజిటివ్ రేటు బాగా పెరిగిపోతోంది. ఈ విషయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తంచేశారు. వివిధ రాష్ట్రాల్లోని ఆరోగ్యశాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో వర్షవర్ధన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపిలో పాజిటివిటీ రేటు 30 శాతం ఉందన్నారు. రాష్ట్రంమొత్తం మీద చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా కేసుల నమోదవుతున్నట్లు సమాచారం.

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉధృతి ఏపితో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో చాలా ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏపిలో 22,157 కేసులు నమోదయ్యాయి. కేసుల నియంత్రణకు లాక్ డౌన్ ఒకటే మార్గమని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఏప్రిల్ 19 నుండి లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 19కి ముందువరకు రోజుకు 25-30 వేల కేసులు నమోదయ్యాయి.

అయితే లాక్ డౌన్ పెట్టిన కొద్దిరోజుల తర్వాత నుండి కేసుల తీవ్రత తగ్గిపోయింది. గడచిన మూడురోజులుగా ఢిల్లీలో నమోదవుతున్న కేసుల సంఖ్య సగటున 7 వేలుగా రికార్డవుతోంది. కేసుల సంఖ్య రోజుకు 30 వేల నుండి 7 వేలకు తగ్గిపోయిందంటే లాక్ డౌన్ విధించటంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా చేపట్టడమే అని అర్ధమవుతోంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే ఏపిలో కూడా తక్షణమే సంపూర్ణ లాక్ డౌన్ విధించం ఒకటే మార్గం. ప్రస్తుతం కర్ఫ్యూ విధించినా దీని ప్రభావం పెద్దగా కనబడటంలేదు. అదే సంపూర్ణ లాక్ డౌన్ విధించినపుడే జనాలు రోడ్లపైకి రావటం కంట్రోలవుతుంది. అలా కంట్రోల్ అయినపుడే కేసుల ఉధృతి తగ్గుతుంది. లేకపోతే కేసుల వ్యాప్తిని అరికట్టడం ప్రభుత్వ తరంకాదు. ముందు కేసుల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న ఐదు జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే.