డేటింగ్ యాప్ తో పరిచయం.. అడ్డంగా బుక్ అయిన వితంతువు

చుట్టూ ఉన్న వారిని వదిలేసి.. ఏ మాత్రం పరిచయం లేని వారితో స్నేహం చేయటం.. వారితో సాన్నిహిత్యాన్ని కోరుకోవటం లాంటివి విన్నంతనే ఒకలాంటి ఉత్తేజాన్ని ఇస్తాయి. కానీ.. దాని వెనుక మోసం.. నమ్మకద్రోహంతో పాటు.. భారీగా ఇమేజ్ డ్యామేజ్ చేసే ఇబ్బందులు ఉంటాయన్న విషయాన్ని చాలా మంది గుర్తించరు. కానీ.. వారు ఆ విషయాన్ని గుర్తించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి వెలుగు చూసింది.

హైదరాబాద్ కు చెందిన ఒక వితంతువు.. డేటింగ్ యాప్ లో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. అందులో రాజ్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. ఇక్కడ రాజ్ గురించి కాస్త చెప్పాలి. ఇతడు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైనింగ్.. టీ కప్పులు తయారీ పరిశ్రమను నడిపేవాడు. అయితే.. వీటిల్లో నష్టాలు రావటంతో సులువుగా డబ్బులు సంపాదించటం కోసం డేటింగ్ యాప్ లో తన పేరును నమోదు చేసుకున్నాడు.

తనకు పరిచయమైన వారికి తియ్యటి కబుర్లు చెప్పటం.. మాయమాటలతో సినిమా చూపించేయటం చేస్తాడు. సదరు హైదరాబాద్ వితంతువుకు ఇలాంటి బొమ్మనే చూపించిన అతగాడు.. తాను చేసే వ్యాపారానికి డబ్బులు ఇవ్వాలని కోరాడు. త్వరలో పెళ్లి చేసుకుందామన్న మాటతో పాటు.. ఆమె కొడుక్కి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో.. అతడ్ని నమ్మిన ఆమె ఇప్పటివరకు రూ.3లక్షలు ఇచ్చింది.

డబ్బులు చేతిలో పడిన వెంటనే.. ఫోన్ బంద్ చేయటంతో తాను మోసపోయినట్లుగా గుర్తించింది. రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన వారు బెంగళూరులో రాజ్ ను అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. డేటింగ్ యాప్ లు.. ఆన్ లైన్ పరిచయాల్ని ఏ మాత్రం నమ్మకూడదన్న విషయాన్ని తాజా ఉదంతం మరోసారి రుజువు చేసిందని చెప్పాలి.