కోడి చేసిన మ‌ర్డ‌ర్‌..

ఇదో సంచ‌ల‌నం! విస్మ‌య‌క‌రం! కోడి పుంజు.. అనే జీవి.. ఓ వ్య‌క్తిని దారుణంగా హ‌త్య చేసింద‌ట‌! స‌ద‌రు వ్య‌క్తి పొట్ట‌లో క‌త్తి పెట్టి పొడిచి పొడిచి చంపింద‌ట‌!! దీంతో దానిని వెంట‌నే అరెస్టు చేసి కేసు క‌ట్టేశారట‌.. మ‌న పోలీసులు. ఇక‌, ఇత‌ర కేసుల్లో ఇంత ఫాస్ట్‌గా ఉంటారో ఉండ‌రో తెలియ‌దు కానీ.. ఈ కేసులో మాత్రం చాలా ఫాస్ట్‌గా FIR క‌ట్టేశారు. అంతేకాదు.. స‌ద‌రు వ్య‌క్తిని హ‌త్య చేసినందున కోడి పుంజును తాము A1 నిందితుడిగా చేర్చేసి.. అరెస్టు చేశామ‌ని కూడా చెప్పేశారు. పుంజు హంత‌కుడిని పోలీసు స్టేష‌న్‌కు సైతం త‌ర‌లించారు… ఇదేదో ఎక్క‌డో జ‌ర‌గ‌లేదు.. వేరే దేశంలోనో లేక మ‌న దేశంలో మార‌మూల రాష్ట్రంలోనో జ‌రిగిన ఘ‌ట‌న కాదు.. ఏకంగా.. మ‌న ద‌గ్గ‌రే మ‌న తెలంగాణ రాష్ట్రంలోనే చోటు చేసుకున్న న‌మ్మ‌లేని.. మ‌ర్డ‌ర్‌.. నిజం!!

ఏం జ‌రిగిందంటే..
మ‌నోళ్ల‌కు కోడి పందేలు వేయ‌డం అల‌వాటే. ముఖ్యంగా సంక్రాంతి పండ‌గ‌ల‌కు కోడి పందేలేయ‌క‌పోతే.. అస‌లు పండ‌గ వాతావ‌ర‌ణ‌మే ఉండ‌దు.. రాదు కూడా! ఇలానే.. తెలంగాణ‌లోని జగిత్యాల జిల్లా, వెలగటూరు మండలం, కొండపూర్‌కు చెందిన తనుగుల సతీష్ అనే యువ‌కుడు.. తొత్తునూరులో తన స్నేహితులతో కలిసి కోడిపందేలు నిర్వహించాడు. కోడిని పందెంలో దించే సమయంలో కత్తికట్టిన కాలు కాకుండా మరో కాలిని పట్టుకున్నాడు. ఎంతైనా.. స‌ద‌రు కోడి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది క‌దా.. అలానే ఈ కోడి పుంజు కూడా త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలో కోడిపుంజును సతీష్ గట్టిగా పట్టుకోవడంతో కాలికి క‌ట్టిన కత్తి సతీష్ పొట్టలో గుచ్చుకుంది. ఇలా రెండు మూడు సార్లు జ‌రిగింది.

విష‌పూరితం కావ‌డంతో..
సాదార‌ణంగా కోడి క‌త్తుల‌కు విషం పూస్తారు. ఎదుటి కోడిని ప‌డ‌గొట్టాలంటే.. క‌త్తుల‌కు విష‌యం పూయ‌డం స‌హ‌జం. ఈ కోడి పుంజు విష‌యంలోనూ అదే జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు. పైగా ప‌దునైన క‌త్తి కావ‌డంతో బాధితుడు స‌తీష్‌ని జిగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండడంతో మార్గమధ్యలోనే మృతి చెందాడు. అయితే.. ఇది జ‌రిగి మూడు రోజులైంది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకుని విచారణ చేపట్టిన పోలీసులు.. స‌తీష్ మరణానికి కారణం ఎవ‌ర‌నే విష‌యంపై త‌మ మెద‌ళ్ల‌కు ప‌దును పెట్టారు.
ఈ క్ర‌మంలో హ‌త్య‌కు కార‌ణం కోడి పుంజేన‌ని తేల్చేశారు. వెంట‌నే వెనుకా ముందు ఆలోచించ‌కుండా.. పుంజు రాజాని తీసుకొచ్చి స్టేషన్‌లో కట్టేశారు.

ఏ1.. పుంజు రాజానే!
స‌తీష్ హ‌త్య ఘ‌ట‌న‌లో కోడి పందేలు ఆడినవారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా సతీష్ మరణానికి కోడి పుంజే కారణమని పేర్కొంటూ.. దానిని ఏ1 ముద్దాయిగా చేర్చారు. త్వరలోనే కోర్టులో ప్రవేశ పెట్టనున్న‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే.. అప్ప‌టి వ‌ర‌కు పుంజురాజాను కంటికిరెప్పలా చూసుకునేందుకు పోలీసులు నానాపాట్లు పడుతున్నారు. దానికి తిండి.. నీరు పెడుతున్నారు. అయితే.. అది కుదురుగా ఉంటుందా? అరుపులు, కేక‌ల‌తో.. కూత‌ల‌తో పోలీసుల‌కు ప‌ర‌మ చిరాకు తెప్పిస్తోంది!! ఇదీ సంగతి!!