కోట్ల ఆస్తులు కొట్టేసిన కోనేటి సులోచన

ఒకప్పుడు ఆమె ఒక సామాన్య మహిళ. సాధారణ కూలీ. ఒక చిన్న గదిలో నివాసం వుండేది. కేవలం గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఆమె దిశ మారింది. వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టింది… కాదు కొల్లకొట్టిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆమె పేరు కోనేటి సులోచన. ఊరు మదనపల్లి. కోట్ల ఆస్తుల కోనేటి సులోచన లేడి డాన్ గా పోలీసు రికార్డులకెక్కారు.

వ్యవసాయ కూలీగా పనిచేసే కోనేటి సులోచనకు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక మాజీ మంత్రి ముఖ్య అనుచరుడితో పరిచయం కలిగింది. దాంతో ఆమె దశ తిరిగింది. అతడితో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆమె అనతికాలంలోనే డాన్ గా ఎదిగింది. పుష్కలంగా రాజకీయ అండదండలు లభించడంతో చెలరేగిపోయింది. కొట్లాది రూపాయల విలువ చేసే భూములపై కన్నేసింది. అమాయక ప్రజలుకు అప్పులు ఇచ్చినట్లు ఖాళీ బాండ్ పేపర్ల మీద బలవంతంగా సంతకాలు తీసుకుంది. ఆ ఖాళీ బాండ్ పేపర్ల మీద ఫోర్జరీ సంతకాలు చేసి వారి ఆస్తులు రాసుకున్నట్లు ఆరోపణలు వున్నాయి. ఆమె కంట పడిన విలువైన భూములన్నీటినీ
బలవంతంగానో, మోసపురితంగానో కొట్టేసింది.

గిఫ్ట్ డీడ్ రూపంలో ఒక మాజీ మంత్రి భార్య నుంచి కీలక భూములను మదనపల్లి రిజిస్టర్ కార్యాలయం ద్వారా రాయించుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒక వ్యక్తికి చెందిన 10 కోట్ల రూపాయల విలువ కలిగిన 47 సెంట్ల ఖరీదైన భూమిని పవర్ ఆఫ్ ఆటార్నీ ద్వారా కాజేయడం వివాదంగా మారింది. అయితే ఈ భూమిని ఆమె బలవంతంగా ఆక్రమించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. అయినా అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాజీ మంత్రి పలుకుబడిని అడ్డం పెట్టుకొని బాధితులను బెదిరించినట్లు ఆరోపణలు వున్నాయి.

కోనేటి అక్రమాలు, భూ కబ్జాలు కోర్టు దాకా వెళ్లడంతో పోలీసుల్లో కదలిక వచ్చింది. మదనపల్లి డీఎస్పీ బుచ్చిరాజు ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలతో ఏర్పాటు చేసిన మూడు బృందాలు సులోచన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ లభ్యమైన ఆస్తుల పత్రాలు చూసి బాబోయ్ అంటూ అదిరిపడ్డారు. ఆమె ఇంట్లో 15 ఫోర్జరీ సంతకాలు చేసిన ఖాళీ బాండు పేపర్లు దొరికాయి. వాటి మీదనే ఆమె అమాయకులను బెదిరించి సంతకాలు చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంకా 50 ఆస్తి పత్రాలు లభ్యమయ్యాయి.

మదనపల్లిలోని బండ్లకమ్మ మీద పల్లిలో 502 గజాల స్థలం, భారీ భవనం వున్నట్లు గుర్తించారు. పొన్నూటి పాళ్యంలో 1.75 ఎకరాల పొలం కూడా వుంది. కోర్టు సెర్చ్ వారంట్ తో సోదాలు నిర్వహించిన పోలీసుల బృందం లభ్యమైన పత్రాలను ఫోరెన్సీ లాబరేటరికి పంపించనున్నట్లు మీడియాకు వెళ్ళండించారు. కోనేటి సులోచన మీద దాడులు, దౌర్జన్యాలు చేసినట్లు ఫిర్యాదులు వున్నాయి. వందల కోట్ల ఆస్తులే కాకుండా మదనపల్లిలోని అన్నీ పోలీసు స్టేషన్లలో కలుపుకొని 14 క్రిమినల్ కేసులు కూడా వున్నాయి.