ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్… శిథిలాల కింద 50 మంది?

ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పుకూలిన ఘటన షాకింగ్ గా మారింది. ఈ భవనంలో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది విద్యార్థులు హాస్టల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే, ఆదివారం కావడంతో చాలామంది విద్యార్థులు హాస్టల్ లో ఉన్నారని, శిథిలాల కింద ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయం కావడంతో భోజనం చేసేందుకు విద్యార్థులు హాస్టల్ లోనే ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ వర్సిటీకి దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో హాస్టళ్ల సంఖ్య ఎక్కువ. ఈ ప్రాంతంలోని హాస్టళ్లలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉంటున్నారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం భవనం కింద 50 మంది ఉంటారని తెలుస్తోంది. వారిని బయటకు తీసుకువచ్చేందుకు జేసీబీలు,12 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ హెల్ప్ అంటూ విద్యార్థుల కేకలు వినిపిస్తున్నట్లు సహాయక సిబ్బంది చెబుతున్నారు. భవనం కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.